పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కోలీవుడ్ మూవీస్

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కోలీవుడ్ మూవీస్

చెన్నై: కరోనా లాక్ డౌన్ కారణంగా అన్ని ఇండస్ట్రీస్ తోపాటు ఫిల్మ్ ఇండస్ట్రీ పనులు కూడా ఆగిపోయాయి. షూటింగ్స్ నిలిపేయడంతో చాలా మూవీస్ రిలీజ్ డేట్స్ ను వాయిదా వేశాయి. ఈ నేపథ్యంలో సినిమాలకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేసుకోవడానికి అనుమతించాలని కోలీవుడ్ నిర్మాతలు తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన రాష్ట్ర సర్కార్ ఈ నెల 11 నుంచి ఫిల్మ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ చేసుకోవాలని అనుమతిని ఇచ్చింది. స్టూడియోలను క్రిమి సంహారాలతో డిస్ ఇన్ఫెక్ట్ చేయడంతోపాటు టెక్నికల్ సిబ్బంది మాస్కులు కట్టుకొని, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ వర్క్ చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. దీంతో కొన్ని సినిమాలు నిర్మాననంతర కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ కోవలో కోలీవుడ్ లో ఈ ఏడాది మోస్ట్‌ క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ గా రూపొందుతున్న మాస్టర్ సినిమా కూడా చేరింది.

ఇళయ దళపతి విజయ్ హీరోగా, మక్కన్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ముగిసింది. ఈ ఫిల్మ్ కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టినట్లు డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ సినిమాతోపాటు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఇండియన్–2, విజయ్ సేతుపతి హీరోగా వస్తున్న ‘కా పే రణసింగం’ సినిమాల పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ కూడా ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 8న విడుదలవ్వాల్సిన మాస్టర్ ఫిల్మ్ కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమా దీపావళికి థియేటర్స్ లో విడుదలవనుందని రూమర్లు వినిపిస్తున్నాయి. దీనిపై మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి అధికార ప్రకటన విడుదల చేయలేదు.