హైదరాబాద్, వెలుగు : పాంపెంట్లు, పోస్టర్ల ప్రింట్ విషయంలో ప్రింటింగ్ ఏజెన్సీలు ఎన్నికల కోడ్ను పాటించాలని ఎంసీసీ నోడల్ ఆఫీసర్ ప్రకాశ్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం హైదరాబాద్, పరిసర ప్రాంతాల ప్రింటింగ్ ఏజెన్సీలకు బల్దియా హెడ్డాఫీసులో ఆయన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో ప్రింటింగ్ ఏజెన్సీల విధి విధానాల గురించి వివరించారు. పీపుల్స్ రిప్రజంటేషన్ యాక్ట్ 1951, సెక్షన్ 127 ఏ ప్రకారం ప్రింటింగ్ ఏజెన్సీలు వ్యవహరించాలన్నారు.
పాంప్లెంట్లు,పోస్టర్లు ప్రింట్ చేసేటప్పుడు ఏజెన్సీ పేరు, కాంటాక్ట్ డీటెయిల్స్, పబ్లిషర్ డీటెయిల్స్, ఆర్డర్ చేసిన కాపీల డీటెయిల్స్ను ప్రింట్ చేయాలని పేర్కొన్నారు. ప్రింట్ చేసిన పోస్టర్లు, పాంపెంట్లు శాంపిల్స్ను నిర్ణీత సమయంలో సంబంధిత ఎన్నికల అధికారికి అందించాలని తెలిపారు. దీని కోసం mccelectionadvts@gmail.com మెయిల్ ఐడీని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చును తెలియజేసేలా సిటీలోని ప్రింటింగ్ ప్రెస్ పోస్టర్లు, పాంపెంట్లను ప్రింట్ చేయాలని ప్రకాశ్ రెడ్డి సూచించారు.