గత సీజన్ కంటే ఎక్కువ ధాన్యం కొనుగోలు : కలెక్టర్ రాహుల్ రాజ్

గత సీజన్ కంటే ఎక్కువ ధాన్యం కొనుగోలు : కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్, వెలుగు: గత సీజన్ కంటే  ఈ సీజన్ లో  25 వేల టన్నుల ధాన్యం అదనంగా  కొనుగోలు చేసినట్టు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. గురువారం హవేలీ ఘన్​పూర్ మండలం బూరుగుపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఈ సీజన్ లో ఇప్పటి వరకు 2,85,446 టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, రైతుల ఖాతాల్లో  రూ.579 కోట్లు జమ చేసినట్టు వెల్లడించారు. ఈ సీజన్​లో కొనుగోలు కేంద్రాల ద్వారా 68,588 మంది రైతులకు ప్రయోజనం  కలిగిందన్నారు. 223 కేంద్రాల్లో కొనుగోలు పూర్తిచేసి ముగించామన్నారు. ధాన్యం కొనుగోలు తుది దశలో ఉందని, మరో వారం రోజుల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుందన్నారు. చివరి గింజ వరకు ధాన్యం సేకరిస్తామని, రైతులెవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ సింధు రేణుక  ఉన్నారు. 

ట్రాఫిక్ రూల్స్ కఠినంగా అమలు.. 

ట్రాఫిక్ రూల్స్ కఠినంగా అమలు చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్ లో రహదారి భద్రతపై జిల్లా స్థాయి  నెలవారీ సమావేశం జరిగింది. జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్, ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రహదారి ప్రమాదాలను తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై పక్కా ప్రణాళికతో క్షేత్రస్థాయిలో అమలు చేయాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలు కఠినంగా అమలు చేస్తున్నామన్నారు. వివిధ శాఖల అధికారుల సమన్వయంతో భద్రతా చర్యలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్అండ్ బీ ఈఈ సర్దార్ సింగ్, డీఎస్పీ ప్రసన్న కుమార్, నేషనల్ హైవే, పోలీస్ రెవెన్యూ, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.