సింగరేణి నిధులతో సైన్స్ మ్యూజియం..మెదక్ జిల్లా శివ్వంపేట జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు

సింగరేణి నిధులతో సైన్స్ మ్యూజియం..మెదక్  జిల్లా శివ్వంపేట జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు
  • రూ.70 లక్షలతో బిల్డింగ్​, రూ.30 లక్షలతో సైన్స్​ ఎక్విప్​మెంట్స్​
  • జిల్లాలో ఇదే మొదటి సైన్స్​మ్యూజియం

మెదక్​/శివ్వంపేట, వెలుగు: సింగరేణి నిధులు రూ.కోటితో మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్​ హైస్కూల్​లో  సైన్స్​ మ్యూజియం ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లాలో ఇది మొట్టమొదటి సైన్స్​ మ్యూజియం. సీఎస్ఆర్​ కింద సింగరేణి సంస్థ మ్యూజియం ఏర్పాటు కోసం ఆర్థిక సాయం అందజేసింది. ఈ మేరకు రూ.70‌‌‌‌లక్షలతో ప్రత్యేకంగా విశాలమైన హాలుతో బిల్డింగ్​ నిర్మించి అందులో మ్యూజియం నెలకొల్పారు. 

రూ.30 లక్షల వ్యయంతో సైన్స్​ఎక్విప్​మెంట్స్​ కొనుగోలు చేసి మ్యూజియంలో ఏర్పాటు చేశారు. సాధారణంగా స్టూడెంట్స్​సైన్స్​, మ్యాథ్స్​ సబ్జెక్టులను టఫ్​​ సబ్జెక్టులుగా భావిస్తారు. దీనిని దృష్టిలో పెట్టుకొని జీవ, భౌతిక, రసాయన, గణిత శాస్త్రాలపై స్టూడెంట్స్​కు ప్రత్యక్ష అవగాహన కల్పించేందుకు, సులభంగా అర్థం చేసుకుని సైన్స్​ సబ్జెక్టులపై పట్టు సాధించేందుకు వీలుగా ఈ మ్యూజియాన్ని తీర్చిదిద్దారు. 

జీవ శాస్త్రం, భౌతిక, రసాయన, గణిత శాస్త్రాలపై అవగాహన కల్పించే విధంగామ్యూజియంలో పలు ఎగ్జిబిట్లను ఉంచారు. మానవుడి జీర్ణ వ్యవస్థ, అస్థి పంజరం, వివిధ శాస్త్ర వేత్తల పరిశోధనలు, జీవిత చరిత్రలు, రంగు నీడలు, తేలియాడే బంతి, అనంతమైన బావి, లోలకాకృతులు, వివిధ రకాల కంపనాలు, -ఆవి సృష్టించే ధ్వని, గురుత్వాకర్షణ, చలన చిత్ర దర్శిని, కర్ర విన్యాసం, డైనమో, బ్లాక్​హోల్​, పైకాన్​ సిద్ధాంతాన్ని వివరించే పలకలు, సంభావ్యతను తెలియచేసే పరికరం లాంటి సైన్స్​ ఎక్విప్​మెంట్​ఏర్పాటు చేశారు.

 ప్రతి ప్రభుత్వ హైస్కూల్​నుంచి 8, 9,10 తరగతుల స్టూడెంట్స్​ను  వారంలో ఒకసారి మ్యూజియానికి తీసుకు వచ్చి ఆయా సైన్స్ పరికరాల ద్వారా సైన్సు సబ్జెక్టులపై ప్రత్యక్ష అవగాహన కల్పించనున్నారు. ప్రస్తుతం శివ్వంపేట హైస్కూల్​ స్టూడెంట్స్​కు అవగాహన కల్పిస్తుండగా జులై మొదటి వారంలో మ్యూజియంను అధికారికంగా ప్రారంభించి ఇతర స్కూళ్ల స్టూడెంట్స్​సందర్శనకు అవకాశం కల్పించనున్నారు.  

సులభంగా సైన్స్​ అర్థమవుతుంది

సైన్స్ సబ్జెక్టు విషయంలో స్టూడెంట్స్​కన్ఫ్యూజ్ అవుతుంటారు. అలాంటప్పుడు ఆయా సైన్స్​ పరికరాల పనితీరును ఫిజికల్ గా చూపించి, పాఠ్యాంశాలు ప్రత్యక్షంగా బోధించడం వల్ల సబ్జెక్టు ఈజీగా అర్థమవుతుంది. సైన్స్​ మ్యూజియంలో ఉన్న త్రీడీ ఇమేజ్ పరికరాలతో స్టూడెంట్స్​కు మంచి అవగాహన వస్తుంది.- విజయలక్ష్మి, ఫిజిక్స్​ టీచర్, శివ్వంపేట

విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తి పెరుగుతుంది

మెదక్​ జిల్లాలో మొట్టమొదటి సైన్స్​ మ్యూజియం ఇది. సింగరేణి సంస్థ సహకారంతో అన్ని హంగులతో దీనిని ఏర్పాటు చేశాం. స్టూడెంట్స్​​ఈ మ్యూజియంను సందర్శిస్తే సైన్స్ సబ్జెక్టులపై అవగాహన,  పరిజ్ఞానం పెరుగుతుంది. ఇక్కడ ఉన్న ఎగ్జిబిట్లు, పరికరాలను ప్రత్యక్షంగా చూసి వాటి పనితీరు, ఫలితాలు తెలుసుకోవడం ద్వారా విజ్ఞాన శాస్త్రంపై మక్కువ పెరుగుతుంది. 8,9,10 తరగతి స్టూడెంట్స్​కు మ్యూజియం ద్వారా సైన్స్​పై అవగాహన కల్పిస్తాం. మండలంలో పనిచేసే 10 మంది సైన్స్ టీచర్స్ కు స్టూడెంట్స్​కు ఎలా అవగాహన కల్పించాలనే దానిపై శిక్షణ ఇచ్చాం. - బుచ్చానాయక్​, ఎంఈవో, శివ్వంపేట