- మరో నలుగురికి గాయాలు
నర్సాపూర్/కౌడిపల్లి, వెలుగు : రెండు బైక్లు, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు చనిపోగా మరో నలుగురికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ పరిధిలోని ఆనంద్ గార్డెన్స్ వద్ద ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిన్నకంజర్ల గ్రామానికి చెందిన నర్సింగరావు (29)కు గత నెలలో పాప పుట్టింది.
నర్సాపూర్ మండలం లింగాపూర్లో ఉన్న తన పాపను చూసేందుకు ఆదివారం కంజర్ల నుంచి బైక్పై బయలుదేరాడు. ఇదే సమయంలో కౌడిపల్లి మండలం వెంకట్రావ్పేటకు చెందిన దిలీప్ (18), మనోహర్ బైక్పై నర్సాపూర్ వైపు నుంచి వస్తున్నారు.
నర్సాపూర్ పట్టణ పరిధిలోని ఆనంద్ గార్డెన్స్ వద్దకు రాగానే రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఇదే సమయంలో నర్సాపూర్ వైపు నుంచి వస్తున్న ఓ ఆటో బైక్లను ఢీకొట్టి రోడ్డు పక్కకు దూసుకెళ్లి పార్క్ చేసి ఉన్న డీసీఎంను ఢీకొట్టింది.
ప్రమాదంలో నర్సింగరావు అక్కడికక్కడే చనిపోయాడు. దిలీప్, మనోహర్తో పాటు ఆటోలో ఉన్న డ్రైవర్ రమేశ్, అశోక్, కవితకు గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు తీవ్రంగా గాయపడ్డ దిలీప్, మనోహర్ను నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు తరలించారు. అక్కడ పరీక్షించిన డాక్టర్ దిలీప్ అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. మనోహర్ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు నర్సాపూర్ పోలీసులు తెలిపారు.
