మెదక్ టౌన్, వెలుగు: జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా నవంబరు 30 వరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని మెదక్ ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు తెలిపారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నెలరోజుల పాటు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని పేర్కొన్నారు.
పోలీసుల అనుమతి లేకుండా ప్రజలు ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదన్నారు. అలాగే ప్రజాధనానికి నష్టం కలిగించే చట్టవ్యతిరేక కార్యక్రమాలు చేయొద్దని చెప్పారు. ఈ విషయంలో జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని ఎస్పీ శ్రీనివాస్ రావు కోరారు.
