కౌడిపల్లి, వెలుగు: కులం పేరుతో దూషిస్తూ, చీటికిమాటికి కొడుతున్న టీచర్, పట్టించుకోని ప్రిన్సిపాల్ తీరును నిరసిస్తూ మెదక్ జిల్లా కౌడిపల్లి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు మంగళవారం ఆందోళనకు దిగారు. 8,9,10 తరగతులకు చెందిన విద్యార్థులు అర గంట హైవేపై రాస్తారోకో చేశారు. సోషల్ టీచర్ ఉదయ్ క్లాస్ రూమ్ లోకి వచ్చి తరచూ కులం పేరుతో దూషిస్తున్నాడని ఆరోపించారు. కాలు బూటంత లేరు, నా చేతికున్న వాచ్ అంత కాదు మీరు.. అంటూ ఇష్టం వచ్చినట్లు తిడుతున్నాడని వాపోయారు.
ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ ఫణి కుమార్ కు చెబితే పట్టించుకోకపోగా, ఆయన కూడా కులం పేరుతో దూషిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్, సోషల్ టీచర్ ను సస్పెండ్ చేసేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. ఆందోళనకు దిగిన టెన్త్ స్టూడెంట్లు పరీక్ష రాయబోమని చెప్పారు. విషయం తెలుసుకున్న పోలీసులు విద్యార్థులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.
