
- జాతీయ పార్టీల సెంటిమెంట్ గేమ్
- లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా ఆట
- అత్యధిక సీట్లపై ఇరు పార్టీల కన్ను
- త్వరలో నిర్ణయం తీసుకోనున్న రేవంత్ సర్కార్
హైదరాబాద్: అయోధ్య శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠాపన నేపథ్యంలో ఇంటింటికీ అక్షింతలు పంపిణీ చేసింది బీజేపీ, ఊరూరా ఎల్ ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలను ప్రత్యక్ష ప్రసారం చేయించింది. ప్రతిష్ఠాపనకు దాదాపు నెల రోజుల ముందు నుంచే యావత్ దేశాన్ని రామమయంగా మార్చేసింది. మోదీ వల్లే రామమందిర నిర్మాణం సాధ్యమైందనే చర్చించుకునే స్థాయికి తీసుకెళ్లింది. ఈ క్రమంలో బీజేపీ భారీ మైలేజ్ వచ్చింది. ఇదే భక్తి అస్త్రాన్ని ప్రయోగించేందుకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. రెండేండ్లకు ఒక సారి జరిగే తెలంగాణ కుంభమేళను అస్త్రంగా వినియోగించుకోనుంది.
కోట్లాది మంది భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లులుతున్న సమ్మక్క, సారలమ్మల ప్రసాదాన్ని ఇంటింటికీ అందించేందుకు సిద్ధమవుతోందని సమాచారం. వనదేవతల ఆశీర్వాదం ఉంటే అంతా మంచే జరుగుతుందని యావత్ తెలంగాణ నమ్ముతుంది. ఇక్కడికి పొరుగు రాష్ట్రాల నుంచి గిరిజనులు కూడా భారీగా తరలివస్తారు. అమ్మవారి ప్రసాదంగా ఇచ్చే బెల్లాన్ని బంగారంగా పిలుస్తారు. ఈ ప్రసాదం అందడాన్ని సెంటిమెంట్ గా భావిస్తారు. వనదేవతల ప్రసాదంతోపాటు పసుపు, కుంకుమ, గాజులను చేర్చి ప్రత్యేక ప్యాక్ గా చేసి ప్రతి ఇంటికీ అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నదని తెలుస్తోంది. దీనిపై ఇటీవల గాంధీభవన్ లో జరిగిన ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ లో చర్చ జరిగినట్టు సమాచారం. మెజార్టీ నేతలు సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికల వేళ సమ్మక్క, సారలమ్మ ప్రసాదం పంపిణీ తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ బలంగా విశ్వసిస్తోంది.