- వేలాది శిల్పాలకు ప్రాణం పోసిన ..
- సమ్మక్క సారలమ్మ ఆర్కియాలజీ రీసెర్చ్ ఇన్స్స్టిట్యూట్
- ఢిల్లీ, మధ్యప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీల్లో..
- చదువుతున్న స్టూడెంట్లతో స్పెషల్ టీమ్
- ఆదివాసీ చరిత్ర, మూలాలపై పదేండ్ల పాటు పరిశోధన
- కోయల గొట్టుగోత్రాలు, శిల్పాల తయారీలో వీరే కీలకం
- ఆళ్లగడ్డలో శిల్పులకు, మేడారంలో పనులకు సహకారం అందిస్తున్న స్టూడెంట్స్
వరంగల్/ములుగు/తాడ్వాయి, వెలుగు : మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధి, పునఃనిర్మాణంలో భాగంగా భారీ గ్రానైట్ శిలలు, వాటిపై చెక్కిన శిల్పాలు, ఆదివాసీ వంశీయుల గొట్టు గోత్రాలు, ఆచార సంప్రదాయాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కాగా, ఈ శిలలు, చిహ్నాల వెనుక ఇదే ప్రాంతంలోని కామారం కేంద్రంగా పనిచేస్తున్న ‘సమ్మక్క సారలమ్మ ఆర్కియాలజీ అండ్ ఇండిజినస్ రీసెర్చ్ ఇన్స్స్టిట్యూట్’ టీమ్ కీలకంగా పనిచేస్తోంది. ఇప్పటివరకు వేలాది చిహ్నాలకు ప్రాణం పోసిన ఈ టీమ్.. అటు శిల్పులు, ఇటు మేడారంలో జరుగుతున్న పనులకు సహకారం అందిస్తోంది.
సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్లతో రీసెర్చ్ గ్రూప్
ఢిల్లీ, మధ్యప్రదేశ్లోని వివిధ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్న స్టూడెంట్లతో ములుగు జిల్లా తాడ్వాయి మండలం కామారం గ్రామం కేంద్రంగా ‘సమ్మక్క సారలమ్మ ఆర్కియాలజీ అండ్ ఇండిజినస్ రీసెర్చ్ ఇన్స్స్టిట్యూట్’ను ఏర్పాటు చేశారు. ఇన్స్స్టిట్యూట్ ఫౌండర్ డాక్టర్ మైపతి అరుణ్కుమార్ ఆధ్వర్యంలో సుమారు 15 మంది ఈ టీమ్లో పనిచేస్తున్నారు.
గతంలో పరిశోధక విద్యార్థిగా పనిచేసిన అరుణ్కుమార్ 2010 నుంచి బిర్సా ముండా పరిశోధక బృందంతో సింధూ నాగరికత మొదలు ఆదివాసీల కోయ వంశీకుల జీవనశైలి, ఆచార సంప్రదాయాలు, వారు కొలిచిన చెట్టు, పుట్ట వంటి మూలాలపై రిసెర్చ్ చేశారు. ఆపై 2016 నుంచి ‘సమ్మక్క సారలమ్మ ఆర్కియాలజీ రీసెర్చ్ ఇన్స్స్టిట్యూట్’ తరఫున ప్రత్యేకంగా ఓ టీమ్ను ఏర్పాటు చేశారు.
పదేండ్ల పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించి..
కామారం కేంద్రంగా పనిచేస్తున్న రిసెర్చ్ టీమ్ ఆదివాసీల మూలాలు ఉండే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, రాంచీ, కచేరి గఢ్, నర్మద, పచ్చిమెరి (పాంచ్ మడి) వంటి ప్రాంతాల్లో పర్యటించి కోయతూర్ (కోయ) వంశీకుల సమాచారం సేకరించారు.
ఇందులో సమ్మక్క సారలమ్మ వంశీయుల గొట్టు గోత్రాల చరిత్ర, దైవాలతో పాటు దాదాపు 750 కోయ ఇంటిపేర్లతో కూడిన మూలాలపై చిహ్నాలతో కూడిన ప్రత్యేక రిపోర్ట్ను తయారు చేశారు. సమక్కసారలమ్మ చరిత్రకు వచ్చే సరికి ప్రధానమైన 03, 04, 05,06, 07 గొట్టు గోత్రాల చరిత్రను తాళపత్ర గ్రంథాల్లోని చిహ్నాల ఆధారంగా జీవం పోశారు.
సీఎం, మంత్రి ఆహ్వానంతో...
రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరను అభివృద్ధి చేయాలని భావించింది. దీంతో మొదట్లో వివిధ ప్రాంతాలకు చెందిన ఆర్కిటెక్ బృందాలు పలు డిజైన్లు గీశారు. అయితే అవి సమ్మక్క, సారలమ్మ చరిత్ర, ఆదివాసీల జీవనశైలికి దగ్గరగా లేకపోవడంతో మంత్రి సీతక్కతో పాటు కోయలు, మేడారం ఆలయ పూజరుల సంఘం సభ్యులు అభ్యంతరం చెప్పారు.
దీంతో అప్పటికే సమ్మక్క సారలమ్మ చరిత్రపై ఆధారాలతో కూడిన పరిశోధనలు చేసిన కామారం రిసెర్చ్ టీమ్ గురించి మంత్రి సీతక్క ద్వారా తెలుసుకున్న సీఎం రేవంత్రెడ్డి, ఆఫీసర్లు ఆ ఇన్స్స్టిట్యూట్ పరిశోధక బృందాన్ని ఆహ్వానించి మేడారం ప్రాజెక్ట్ గురించి వివరించారు.
24 గంటల్లో ఏడు వేల చిహ్నాలు..
సెప్టెంబర్ 23న సీఎం రేవంత్రెడ్డి మేడారంలో పర్యటించి మేడారం అభివృద్ధి, గద్దెల ప్రాంతం విస్తరణ, పగిడిద్దరాజు, గోవిందరాజు మండపాల మార్పుపై చర్చించారు. తల్లుల చరిత్ర తెలిపేలా పనులు చేపట్టాలన్న సీఎం ఆదేశాలతో కామారం రీసెర్చ్ టీమ్ స్పీడ్గా కదిలింది.
అప్పటికే రిపోర్టులు తయారు చేసి ఉండడంతో... సీఎం వచ్చి వెళ్లిన 24 గంటల్లోనే ప్రధాన ద్వారం, గద్దెల చుట్టూ ఎనిమిది భారీ ఆర్చీలు, చుట్టూ మరో 32 పిల్లర్లతో పాటు బయటి వైపు.. ఎక్కడా ఏ చరిత్రను చిహ్నాలుగా చెక్కిస్తే బాగుంటుందో తెలిపేలా ఏడు వేల బొమ్మలతో కూడిన రిపోర్ట్ను ప్రభుత్వానికి అందించారు. దీనిపై మంత్రులు, కలెక్టర్లు, పూజరుల సంఘం సభ్యులు, కోయల పెద్ద మనుషులు పలుమార్లు చర్చించి అధికారికంగా ఆమోద ముద్ర వేశారు.
మూడు బృందాలు...
మేడారంలో 80 ఫీట్ల ప్రధాన స్వాగత ద్వారం మొదలు అమ్మవార్ల గద్దెల చుట్టూరా 25 ఫీట్లతో 08 ఆర్చీలు, పగిడిద్దరాజు, గోవిందరాజుల మండపాలు, ఆలయ చుట్టూరా 32 పిల్లర్లపై చెక్కే ప్రతి శిల్పానికి రూపం ఇవ్వడంలో కామారం రీసెర్చ్ టీమే ప్రధానంగా పనిచేస్తోంది. ఇన్ స్టిట్యూట్ ఫౌండర్ అరుణ్కుమార్ పర్యవేక్షణలో మూడు టీమ్స్ ఏర్పడ్డాయి.
ఒక టీమ్ ఏ పిల్లర్పై ఏ చిహ్నం చెక్కాలో.. ప్రత్యేకంగా గీసి శిల్పులకు అందించగా.. మరో టీం ఆంధ్రప్రదేశ్లోని ఆళ్లగడ్డకు వెళ్లి పిల్లర్ సైజ్కు అనుగుణంగా చిత్రాలు ఎంత సైజ్లో రావాలో, క్రమపద్ధతి ఎలా ఉండాలో పర్యవేక్షించారు. మరో బృందం మేడారానికి తీసుకొచ్చిన పిల్లర్లను నిర్మించే క్రమంలో.. మార్పులు, చేర్పులకు అనుగుణంగా చిత్రాలు చెక్కడంలో సహకరించారు.
ప్రభుత్వ సహకారంతో ఛాలెంజ్గా పనిచేస్తున్నాం
సీఎం రేవంత్రెడ్డితో పాటు మంత్రి సీతక్క మాపై నమ్మకంతో సమ్మక్క తల్లుల చరిత్రను తెలిపే కీలక టాస్క్ను అప్పగించింది. భావి తరాలకు కోయ జాతి మూలాలు తెలిపే పనుల నిర్వహణలో పూజరుల సంఘం పెద్దలు ఎంతగానో సహకరించారు.
సమ్మక్క సారలమ్మ వంశీయుల గొట్టు గోత్రాలు, కోయల జీవనశైలిపై పనిచేసిన అనుభవంతో మూడు నెలలుగా ఛాలెంజ్గా పనిచేస్తున్నాం. 95 శాతం పనులు పూర్తయ్యాయి. మేడారం జాతర అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నాం.
- డాక్టర్ మైపతి అరుణ్కుమార్,
సమ్మక్క సారలమ్మ ఆర్కియాలజీ అండ్ ఇండిజినస్ రీసెర్చ్ ఇన్స్స్టిట్యూట్ ఫౌండర్
