
ఆంధ్రప్రదేశ్లో మూడు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాల ప్రభావం సాధారణంగా ఉందని చెప్పింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని నైరుతి బంగాళాఖాతం ప్రాంతాల్లో 2.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావం ఏపీపై ఉంటుందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో నేటి నుంచి మూడు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శుక్ర, శనివారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో మోస్తారు వర్షం కురుస్తుందని, అక్కడక్కడ భారీ వర్షం పడుతుందని వెల్లడించింది.