
Meesho IPO: దాదాపు ఆరు నెలల బ్రేక్ తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోల కోలాహలం తిరిగి స్టార్ట్ అయ్యింది. దీంతో వరుస ఐపీవోలు మార్కెట్లలోకి వస్తున్నాయి. ఈక్విటీ మార్కెట్లు ప్రపంచ పరిణామాలతో కొంత అస్థిరతలను చూస్తున్న సమయంలోనూ అనేక ఐపీవోలు మంచి లిస్టింగ్స్ నమోదు చేయటంపై ఇన్వెస్టర్లు సంతోషంగా ఉన్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈకామర్స్ దిగ్గజం మీషో ఐపీవో గురించే. చాలా కాలంగా కంపెనీ తన ఐపీవోను ఫ్లోట్ చేసేందుకు అనువైన సమయం కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కంపెనీ బోర్డు దీనికి ఆమోదం తెలిపింది. ఐపీవో కోసం డ్రాఫ్ట్ పేపర్లను సెబీ వద్ద రహస్య మార్గంలో దాఖలు చేయాలని చూస్తున్నట్లు వెల్లడైంది. కంపెనీ ప్రస్తుతం ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.4వేల 250 కోట్లను సమీకరించాలని ప్లాన్ చేస్తోందని సమాచారం.
కంపెనీ ప్రస్తుతం తీసుకురానున్న ఐపీవోలో తాజా ఈక్విటీ షేర్లతో పాటు ఆఫర్ ఫర్ సేల్ కూడా ఉంటుందని వెల్లడైంది. ఎలివేషన్ క్యాపిటల్, పీక్ XV పార్టనర్స్, ప్రోసస్ అనే పెట్టుబడిదారులు అతిపెద్ద సంస్థాగత వాటాదారులుగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. వీరికి తోడు జపనీస్ సంస్థ సాఫ్ట్ బ్యాంక్ కూడా మెజారిటీ వాటాదారుగా ఉంది. అలాగే కంపెనీలో వెస్ట్బ్రిడ్జ్ క్యాపిటల్, ఫిడిలిటీ వంటి సంస్థలు కూడా పెట్టుబడులను కలిగి ఉన్నాయి.
ప్రస్తుతం మీషో కంపెనీ విలువ దాదాపు 4 బిలియన్ డాలర్లకు దగ్గరగా ఉందని తెలుస్తోంది. ఇన్వెస్టర్లు గమనించాల్సిన మరో విషయం ఏంటంటే ఈకామర్స్ రంగంలో మీషోకు పోటీదారుగా ఉన్న వాల్ మార్ట్ సంస్థ ఫ్లిప్ కార్ట్ కూడా తన ఐపీవోను ఫ్లోట్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అనేక న్యూ ఏజ్ స్టార్టప్ కంపెనీలు ఈ ఏడాది సెబీ వద్ద తమ ఐపీవో పత్రాలను దాఖలు చేసేందుకు క్యూ కట్టాయి. వీటిలో గ్రో, పైన్ ల్యాబ్స్, ఫిజిక్స్ వాలా, అర్బన్ కంపెనీ, షిప్రాకెట్, బోట్, వేక్ఫిట్, క్యాపిల్లరీ టెక్నాలజీస్ వంటి సంస్థలు ఉన్నాయి.