
బ్లడ్, ఐ, ఆక్సిజన్ బ్యాంక్స్ పెట్టి ఎంతోమందికి ఆసరాగా నిలుస్తు మెగాస్టార్ చిరంజీవి..మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. అనారోగ్య కారణాలతో బాధ పడుతున్న కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కుటుంబానికి ఆర్ధిక సాయం అందించారు.
టాలీవుడ్ కి చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ అనారోగ్య కారణాలతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా బారిన పడిన ఆయన ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ లో వెంటిలేటర్ పై ట్రీట్ మెంట్ పొందుతున్నారు. శివ శంకర్ తో పాటు భార్యకి కూడా కరోనా సోకడంతో ఆమె ఇంట్లోనే హోం క్వారంటైన్ అయ్యారు. శివ శంకర్ మాస్టర్ పెద్ద కుమారుడికి కూడా కరోనా సోకడంతో ఆయన కూడా వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు.
ఇంట్లో ముగ్గురు కుటుంబసభ్యులకు కరోనా సోకడంతో ఇబ్బందుల్లో పడింది శివశంకర్ కుటుంబం. దీంతో కుటుంబానికి చికిత్స కోసం రోజుకు లక్ష రూపాయలు ఖర్చు అవుతుండడంతో శివ శంకర్ మాస్టర్ చిన్న కుమారుడు అజయ్ తనకు సహాయం అందించవలసిందిగా సినీ పెద్దలను కోరారు. విషయం తెలిసిన వెంటనే చిరంజీవి అజయ్ కి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకున్నారు. తక్షణ సాయంగా 3లక్షల రూపాయల చెక్కుని అందజేశారు. అంతేకాదు..వైద్యానికి సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శివ శంకర్ మాస్టర్ కు మేమంతా ఉన్నాం అని హామీ ఇచ్చారు.
నాన్న గారికి అనారోగ్యం అనే సంగతి తెలిసిన వెంటనే చిరంజీవి గారు ఫోన్ చేసి పిలిపించారని, తక్షణ సాయంగా మూడు లక్షల రూపాయల చెక్కును అందించారు అని అజయ్ తెలిపాడు. చిరంజీవి గారు అంటే నాన్న గారికి ఎంతో అభిమానం అని.. చిరంజీవి గారితో కలిసి నాన్న సినిమాలు చేశారన్నారు. ఇటీవల ఆచార్య షూటింగులో కూడా నాన్నగారు చిరంజీవిని కలిశారని అజయ్ గుర్తుచేసుకున్నారు. ఇలాంటి సమయంలో ప్రతి రూపాయి తనకి చాలా అవసరం అని.. చిరంజీవి గారు చేసిన సాయం ఎన్నటికీ మర్చిపోలేనన్నారు.