
సీనియర్ సినిమా జర్నలిస్టు పసుపులేటి రామారావు అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసి మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సినియర్ జర్నలిస్టు కానే కాకుండా రామారావు తనకు ఆత్మబంధువని, ఆయన వ్యక్తిత్వం తనకెంతో ఇష్టమని చిరంజీవి అన్నారు.
రామారావు మృతి పట్ల చిరంజీవి సంతాపం వ్యక్తం చేస్తూ ‘‘రామారావు అనారోగ్యంతో బాధపడుతున్నారని, నడవలేకపోతున్నారని తెలిసి సన్ షైన్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ గురవారెడ్డి దగ్గరికి పంపించాను. మోకాళ్ల ఆపరేషన్ చేయించుకోవాలన్నారు. తన అక్కయ్యగారికి బాగోలేదని, ఆమె కోలుకున్నాక ఆపరేషన్ చేయించుకుంటానని రామారావు అన్నారు. లేకలేక పుట్టిన అతని కుమారుడికి మా ముగ్గురు అన్నదమ్ముల పేర్లు కలిసి వచ్చేలా పేరు పెట్టాడు. ఆ కుర్రాడి పేరు కళ్యాణ్ నాగ చిరంజీవి అనుకుంటాను. నేనతన్ని కేవలం ఒక జర్నలిస్టుగానే చూడను. నీతికీ నిజాయితీకీ నిబద్దతకూ మరోరూపంలా చూస్తుంటాను. అతని కుటుంబానికి నేను అన్నిరకాలుగా అండగా ఉంటాను, వాళ్ల కుటుంబం బాగోగులను చూసుకుంటాను ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని తెలిపారు.