మేఘా కంపెనీ డీల్ : మామ పిచ్చిరెడ్డి వాటాను.. రూ.15 వేల కోట్లకు కొనుగోలు చేయనున్న కృష్ణారెడ్డి

మేఘా కంపెనీ డీల్ : మామ పిచ్చిరెడ్డి వాటాను.. రూ.15 వేల కోట్లకు కొనుగోలు చేయనున్న కృష్ణారెడ్డి

Megha Krishna Reddy: మేఘా ఇంజనీరింగ్.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశంలోని అనేక రాష్ట్రాల్లో భారీ ప్రాజెక్టులను చేపట్టిన అనుభవం కలిగిన సంస్థ. పైగా ఈ కంపెనీ ఎలక్ట్రిక్ బస్సుల తయారీ, పవర్, ఇన్ ఫ్రా వంటి అనేక కీలక రంగాల్లో కూడా తన వ్యాపారాలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిని తొలుత స్థాపించింది పీపీ రెడ్డి. ఆ తర్వాత మేనల్లుడు కృష్ణారెడ్డి కూడా వ్యాపారంలోకి వచ్చారు. దాదాపు 30 ఏళ్లుగా వీరిద్దరూ కలిసి మేఘా గ్రూప్ వ్యాపారాలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు పీవీ కృష్ణారెడ్డి, పామిరెడ్డి పిచ్చిరెడ్డి కుటుంబాలు వ్యాపారాన్ని సెటిల్ చేసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. వార్తా కథనాల ప్రకారం మేనమామకి కంపెనీలో ఉన్న 51 శాతం వాటాలను కృష్ణారెడ్డి దాదాపు రూ.15వేల కోట్లు వెచ్చించి కొనుగోలు చేయాలని చూస్తున్నట్లు వెల్లడైంది. వాస్తవానికి ఫోర్బ్స్ నివేదిక ప్రకారం కృష్ణారెడ్డి సంపద విలువ రూ.18వేల కోట్లకు పైగానే ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటాల కొనుగోలు వ్యవహారం రెండేళ్ల నుంచి చర్చించబడుతోందని తెలుస్తోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ వాటాల విక్రయ ప్రక్రియ మార్చి 2027 నాటికి పూర్తవుతుందని సమాచారం.

అయితే 51 శాతం వాటాను కొనుగోలు చేసి పూర్తి యాజమాన్యాన్ని దక్కించుకోవటానికి అవసరమైన నిధుల కోసం వివిధ మార్గాలను కృష్ణారెడ్డి అన్వేషిస్తున్నారు. ప్రైవేటు పెట్టుబడి సంస్థల నుంచి కూడా ఇందుకోసం డబ్బును రైజ్ చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. అలాగే కొన్ని బ్యాంకులతో కోసం దీని కోసం మాటలు కొనసాగుతున్నాయి. యూపీలోని పవర్ ట్రాన్స్మిషన్ వ్యాపార విక్రయం ద్వారా రూ.7వేల కోట్లు సమీకరిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు మేఘా సిటీ గ్యాస్ లిమిటెడ్ వ్యాపారాన్ని కూడా అమ్మే ఉద్ధేశ్యంలో హోల్డింగ్ కంపెనీ ప్లాన్ చేస్తోందని వెల్లడైంది. 

అయితే ఇప్పటి వరకు మేనమామకు వెయ్యి కోట్లను మాత్రమే కృష్ణారెడ్డి సెటిల్మెంట్ కింద చెల్లించినట్లు తేలింది. అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం ఒలెక్ట్రా గ్రీన్ వ్యాపారాలను సైతం కంపెనీ నిధుల కోసం ఉపయోగించుకోవాలని చూస్తోంది. మేఘా ఇంజనీరింగ్ సంస్థ రోడ్లు, డ్యామ్స్, టన్నెల్స్, న్యాచురల్ గ్యాస్, హైడ్రో కార్బన్స్ వంటి అనేక రంగాల్లో ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులను దక్కించుకున్న కంపెనీ ఆ తర్వాత వేగంగా వృద్ధిని సాధించింది. తెలుగు రాష్ట్రాల నుంచి అనేక ఇన్ ఫ్రా సంస్థలు ప్రధానంగా ప్రభుత్వ ఇరిగేషన్ ప్రాజెక్టులతోనే ప్రస్తుతం ఉన్న స్థాయిలకు ఎదిగిన సంగతి తెలిసిందే. అలాగే దేశంలో అత్యధికంగా రూ.966 కోట్లకు ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసినట్లు మేఘా సంస్థ పేరు బయటకు రావటంతో ఆ తర్వాతి నుంచి దర్యాప్తు జరుగుతున్న సంగతి తెలిసిందే.