- మొదటి క్వార్టర్లో 26 శాతం అప్
న్యూఢిల్లీ: ఈ ఏడాది మొదటి క్వార్టర్లో మెర్సిడెజ్ బెంజ్ సేల్స్ జోరందుకున్నాయి. జనవరి–మార్చి 2022 మధ్యలో అమ్మకాలు 26 శాతం పెరిగి 4,022 యూనిట్లకు చేరినట్లు మెర్సిడెజ్ బెంజ్ వెల్లడించింది. సెమి కండక్టర్ల కొరత కొనసాగినప్పటికీ, తమ ఎస్యూవీలు, సెడాన్లు బాగానే అమ్ముడయ్యాయని పేర్కొంది. ఇదేటైములో రామెటీరియల్స్, లాజిస్టిక్స్ ఖర్చులూ భారీగా పెరిగినట్లు కంపెనీ తెలిపింది. అంతకు ముందు ఏడాది (జనవరి–మార్చి 2021) క్వార్టర్లో 3,193 కార్లను మెర్సిడెజ్ బెంజ్ అమ్మింది. ఆర్డర్ బుక్ 4 వేల యూనిట్లకు చేరడంతో ఈ ఏడాది రాబోయే నెలల్లోనూ డిమాండ్ మెరుగ్గానే ఉంటుందనే ధీమాను మెర్సిడెజ్ బెంజ్ వ్యక్తం చేస్తోంది. ఈ–క్లాస్ లాంగ్ వీల్ బేస్ సెడాన్ అమ్మకాలే ఎక్కువగా జరిగాయని, ఎస్యూవీలలో జీఎల్సీ దూసుకెళ్తోందని కంపెనీ పేర్కొంది. అమ్మకాలలో ఆ తర్వాత ప్లేస్లలో జీఎల్ఏ, జీఎల్ఈ ఎస్యూవీలు నిలుస్తున్నట్లు వివరించింది. సూపర్ లగ్జరీ కార్ల పోర్ట్ఫోలియో మొదటి క్వార్టర్లో 35 శాతం గ్రోత్ రికార్డు చేసినట్లు తెలిపింది.
లాంగ్ టర్మ్ రికవరీకి ఈ ఏడాది మొదటి క్వార్టర్ అమ్మకాలు మంచి ఫౌండేషన్గా నిలుస్తాయని మెర్సిడెజ్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మార్టిన్ ష్వెంక్ చెప్పారు. సెమి కండక్టర్ల కొరత, గ్లోబల్ సప్లయ్ చెయిన్లో ప్రోబ్లమ్స్, ఉత్పత్తి ఖర్చుల పెరుగుదల వంటి నేపథ్యంలో తమ సేల్స్ మెరుగుపడటం విశేషమని పేర్కొన్నారు. కంపెనీ హిస్టరీలోనే మునుపెన్నడూ లేనివిధంగా ఆర్డర్లను సాధించగలిగినట్లు చెప్పారు. రాబోయే నెలల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. గ్లోబల్ సప్లయ్ చెయిన్లో ప్రోబ్లమ్స్ వల్లే కస్టమర్లకు తగిన టైములో డెలివరీలు ఇవ్వలేకపోతున్నట్లు మార్టిన్ ష్వెంక్ చెప్పారు. వీలైనంత త్వరగా వెహికల్స్ డెలివరీ ఇచ్చేందుకు కంపెనీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.