హైదరాబాద్, వెలుగు: కరోనా బూస్టర్ డోసు వ్యాక్సిన్పై జనాలు ఆసక్తి చూపడం లేదు. కానీ అర్హులందరికీ వ్యాక్సిన్ వేయాలంటూ క్షేత్రస్థాయి హెల్త్ స్టాఫ్కు సర్కార్ టార్గెట్లు విధిస్తోంది. దీంతో వ్యాక్సిన్ వేయకుండానే వేసినట్టుగా తప్పుడు లెక్కలను హెల్త్ స్టాఫ్ నమోదు చేస్తున్నారు. తమ పరిధిలో సెకండ్ డోసు వేయించుకుని, బూస్టర్ డోసు వేయించుకోకుండా ఉన్న వారి వివరాలను కొవిన్ పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నారు. దీంతో థర్డ్ డోసు వేసుకున్నట్టుగా వారికి మెసేజ్లు వస్తున్నయి. రోజూ సుమారు 1.9 లక్షల మందికి వ్యాక్సిన్ వేస్తున్నట్టుగా ఆరోగ్యశాఖ బులెటిన్లలో పేర్కొంటుండగా, తాము వ్యాక్సిన్ వేయించుకోకుండానే మెసెజ్లు వస్తున్నాయని జనాలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఆరోగ్యశాఖ చెబుతున్న లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఇప్పటివరకూ 3,24,09,257 మంది ఫస్ట్ డోసు, 3,14,13, 730 మంది సెకండ్ డోసు తీసుకున్నారు. 1,0 5, 56, 380 మంది బూస్టర్ డోసు వేయించుకున్నారు. 13.57 లక్షల వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయి.
రోజూ వంద కేసులు
రాష్ట్రంలో రోజూ సగటున వంద కరోనా కేసులు నమోదవుతున్నయి. ఇందులో సగం కేసులు హైదరాబాద్లో వస్తుండగా, ఇంకో సగం జిల్లాల్లో నమోదవుతున్నాయని ఆరోగ్యశాఖ బులెటిన్లు తెలిపాయి. థర్డ్ వేవ్ తర్వాత కరోనాతో ఒక్కరు కూడా మరణించలేదని ఆరోగ్య శాఖ పేర్కొంది.