కోల్కతా: అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీ ఇండియా టూర్ సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. గోట్ ఇండియా టూర్–2025లో భాగంగా హైదరాబాద్, ముంబై, కోల్కతా, ఢిల్లీలో తను ఆసక్తికర కార్యక్రమాల్లో పాల్గొంటాడు. ఈ నెల 13న మెస్సీ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి గోట్ కప్ కు మెస్సీ అటెండ్ అవుతాడు.
ఇందులో భాగంగా 7 వర్సెస్7 సెలబ్రిటీ మ్యాచ్ ఆడనున్న మెస్సీ యంగ్ టాలెంటెడ్ ప్లేయర్లకు మాస్టర్క్లాస్ ఇచ్చి పెనాల్టీ షూటౌట్స్లో సందడి చేస్తాడని ఆర్గనైజర్స్ మంగళవారం వెల్లడించారు. మెస్సీ కోసం స్పెషల్ మ్యూజిక్ కన్సర్ట్ కూడా ఉంటుంది. తర్వాతి రోజు ముంబైకి వెళ్లనున్న మెస్సీ సామాజిక సేవ కోసం నిర్వహించే ఈవెంట్లో ర్యాంప్పై నడుస్తాడు.
తన లాంగ్టైమ్ టీమ్మేట్ లూయిస్ , అర్జెంటీనా మిడ్ఫీల్డర్ రోడ్రిగో డిపాల్తో కలిసి ర్యాంప్ వాక్ చేస్తాడని ఆర్గనైజర్ శతద్రు దత్తా పేర్కొన్నారు. దాంతోపాటు 2022 వరల్డ్ కప్లో అర్జెంటీనా విజయాన్ని గుర్తు చేసే ప్రత్యేక వస్తువులను వేలం కోసం తీసుకురావాలని మెస్సీని కోరారు. హైదరాబాద్ వచ్చే ముందు కోల్కతాలో 70 అడుగుల ఎత్తు ఉన్న తన విగ్రహాన్ని భద్రతా కారణాల వల్ల హోటల్ నుంచే మెస్సీ వర్చువల్గా ఆవిష్కరిస్తాడని ఆర్గనైజర్స్ తెలిపారు.
ఇక మెస్సీకి ఇష్టమైన మేట్ (అర్జెంటీనా హెర్బల్ టీ)తో పాటు అస్సాం రుచులతో కూడిన హెర్బల్ టీ, బెంగాలీ చేపల వంటకాలు, స్థానిక స్వీట్లను అందించే ఫ్యూజన్ ఫుడ్ ఫెస్టివల్ను ఏర్పాటు చేయనున్నారు. తన టూర్ చివరి అంకంలో భాగంగా సోమవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన నివాసంలో మెస్సీ కలుస్తాడని ఆర్గనైజర్స్ తెలిపారు.

