రాష్ట్రానికి ఎల్లో అలెర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఉపరితల ద్రోణి, ఆవర్తన ప్రభావంతో మరో మూడు రోజులు మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఒకటి రెండు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని అధికారులు తెలిపారు. రంగారెడ్డి, మేడ్చల్, మెదక్, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందన్నారు. లోతట్టు ప్రాంత ప్రజల అప్రమత్తంగా ఉండాలన్నారు వాతావరణ శాఖ అధికారులు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జంట జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాలు నిండుకుండల్లా మారాయి. ఇన్ఫ్లో భారీగా ఉండటంతో గండిపేట 13 గేట్లు, హిమాయత్ సాగర్ 8 గేట్లు ఎత్తి నీటిని మూసీ నదిలోకి వదులుతున్నారు. ప్రస్తుతం గండిపేట ఇన్ఫ్లో 7500 క్యూసెక్కులు ఉండగా ఔట్ఫ్లో 8281 క్యూసెక్కులుగా ఉంది. హిమాయత్ సాగర్ ఇన్ఫ్లో 7000 క్యూసెక్కులు ఉంటే ఔట్ఫ్లో 7,708 క్యూసెక్కులుగా ఉంది. ఈ జంట జలాశయాలను జలమండలి ఎండీ దానకిశోర్ సందర్శించారు. వరద ప్రవహాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష జరిపారు. రెండు జలాశయాల వద్ద భద్రత మరింత పెంచాలని సూచించారు.