కోవిడ్ తర్వాత హైదరాబాద్ మెట్రో రైల్ లో ప్రయాణీకుల సంఖ్య పెరుగుతోందన్నారు మెట్రో ఎండీ NVS రెడ్డి. కరోనాకు ముందున్న రైడర్ షిప్ పెరగడానికి మరింత సమయం పడుతుందన్నారు. సువర్ణా ఆఫర్ లో ... మంత్లీ లక్కీ డ్రాలో గెలుపొందిన ప్రయాణికులకు బహుమతులు అందించారు మెట్రో అధికారులు.
మెట్రో రైల్ సువర్ణ ఆఫర్ మంత్లీ లక్కీ డ్రాలో గెలుపొందిన విజేతలకు స్మార్ట్ టీవీ, వాషింగ్ మిషన్, మైక్రో ఓవెన్లను అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో అందజేశారు అధికారులు. హైదరాబాద్ మెట్రోలో ప్రస్తుతం డైలీ రెండున్నర లక్షల మంది ప్రయాణిస్తున్నట్టు సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ కేవిబి రెడ్డి తెలిపారు. సువర్ణ ఆఫర్ 2021కు ప్రయాణీకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు ఎన్వీఎస్ రెడ్డి. హైదరాబాద్ వాసులు ట్రాఫిక్ రహిత, సేఫ్ జర్నీగా మెట్రో రైలును ఆదరిస్తున్నట్టు చెప్పారు. రాబోయే రోజుల్లో కరోనాకు ముందున్న మెట్రో రైడర్ షిప్ డైలీ 4లక్షల మంది ఎక్కే అవకాశం ఉందన్నారు.
మెట్రో రైల్ కు కోవిడ్ ప్యాండమిక్ తర్వాత ఇప్పుడు ప్రజల నుంచి ఆదరణ పెరిగిందన్నారు ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ కేవిబి రెడ్డి. దేశ వ్యాప్తంగా ఉన్న మెట్రో ప్రాజెక్ట్ లతో పోలిస్తే... హైదరాబాద్ మెట్రో రైలులో రోజు వారీ ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. సువర్ణ ఆఫర్ పెట్టాక 40వేల మంది ఒక నెలలో 20 ట్రిప్స్ పూర్తి చేసినట్టు తెలిపారు. సువర్ణ ఆఫర్ లక్కీ డ్రా విజేతలను అభినందించారు. మెట్రోలో కోవిడ్ ప్రికాషన్స్ తీసుకుంటూ ప్రయాణికులకు సేఫ్ జర్నీ అందిస్తున్నామన్నారు కేవిబీ రెడ్డి.
మెట్రోలో మరింత మంది ప్రయాణించాలన్న ఉద్దేశ్యంతో సువర్ణ ఆఫర్ ను అక్టోబర్ లో లాంచ్ చేశారు. నెలలో స్మార్ట్ కార్డ్ ద్వారా 20 ట్రిప్స్ చేసిన వారు దీనికి అర్హులవుతారు. అలాగే తమ మొబైల్ నంబర్ మెట్రో టి సవారీ యాప్ తో లింక్ అయిన వారిని... లక్కీ డ్రా ద్వారా సెలెక్ట్ చేస్తున్నారు.