మైక్రోసాఫ్ట్ నుంచి సర్ఫేస్ డ్యుయో

మైక్రోసాఫ్ట్ నుంచి సర్ఫేస్ డ్యుయో

‘మైక్రోసాఫ్ట్’ వచ్చే ఏడాది కొత్త రకం డివైజ్‌‌తో మార్కెట్లోకి రానుంది. ‘సర్ఫేస్‌‌ డ్యుయో’ అనే డ్యుయల్‌‌ స్క్రీన్‌‌ హ్యాండ్‌‌హెల్డ్‌‌ కంప్యూటింగ్‌‌ డివైజ్‌‌ను 2020 క్రిస్‌‌మస్‌‌కి విడుదల చేయనుంది. గతంలో మైక్రోసాఫ్ట్‌‌ నుంచి లూమియా ఫోన్లు వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు మూడేళ్ల నుంచి మైక్రోసాఫ్ట్‌‌ స్మార్ట్‌‌ఫోన్‌‌ బిజినెస్‌‌కు దూరంగా ఉంది. ఇప్పుడు మళ్లీ ఈ తరహా బిజినెస్‌‌లోకి రానుంది. ‘సర్ఫేస్‌‌ డ్యుయో’ డ్యుయల్‌‌ స్క్రీన్స్‌‌ కలిగి ఉన్న డివైజ్‌‌. రెండు స్క్రీన్స్‌‌ రెండు స్మార్ట్‌‌ఫోన్లలాగా ఉంటాయి. దీనితో ఫోన్‌‌ కాల్స్‌‌ చేసుకోవచ్చు. మెసేజ్‌‌లు కూడా పంపుకోవచ్చు. అయితే దీన్ని కంపెనీ ‘స్మార్ట్‌‌ఫోన్‌‌’ అని కూడా చెప్పడం లేదు. అలాగే మైక్రోసాఫ్ట్‌‌ నుంచి ఇప్పటికే విడుదలైన ‘సర్ఫేస్‌‌’ ల్యాప్‌‌టాప్‌‌, ట్యాబ్లెట్ల కంటే కూడా ఇది వేరుగానే ఉంటుంది. ‘సర్ఫేస్‌‌ డ్యుయో’ కొత్తరకం ఫోల్డబుల్‌‌ డివైజ్‌‌. ఆండ్రాయిడ్‌‌ ఓఎస్‌‌పై పని చేస్తుంది. డ్యుయల్‌‌ స్క్రీన్‌‌తోనే ‘సర్ఫేస్‌‌ నియో’ అనే మరో గ్యాడ్జెట్‌‌ను కూడా మైక్రోసాఫ్ట్‌‌ వచ్చే ఏడాది విడుదల చేస్తుంది. సర్ఫేస్‌‌ బ్రాండ్‌‌లోనే ఇయర్‌‌‌‌బడ్స్‌‌ను ఈ ఏడాది చివరికి మార్కెట్లోకి తీసుకొస్తుంది. ‘సర్ఫేస్‌‌ ల్యాప్‌‌టాప్‌‌–3’, ‘సర్ఫేస్‌‌ ప్రొ 7’లు ఈ నెల 22న మార్కెట్లోకి రానుండగా, ‘సర్ఫేస్‌‌ ప్రొ ఎక్స్‌‌’ వచ్చే నెల 5న విడుదలవుతుంది.