
హైదరాబాద్, వెలుగు : తమ సమస్యలను పరిష్కరించకుంటే ఈ నెల 28 నుంచి సమ్మె చేస్తామని మిడ్ డే మీల్స్ కార్మికుల యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ రమ స్పష్టం చేశారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్కు సమ్మె నోటీసులు అందించారు. సీఎం కేసీఆర్ గతేడాది మార్చి 22న అసెంబ్లీలో మిడ్ డే మీల్స్ కార్మికులకు రూ.2వేల వేతనం పెంచుతున్నట్లు ప్రకటించారని గుర్తుచేశారు. కానీ, ఇప్పటికీ ఆ హామీ అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులను కూడా వెంటనే రిలీజ్ చేయాలని, కొత్త మెనూను సవరించాలని కోరారు. గుడ్లకు అదనంగా బడ్జెట్ ఇవ్వాలని, అవసరమైన గ్యాస్ సబ్సిడీకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్కారు స్పందించకుంటే 28 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని పేర్కొన్నారు.