బియ్యం అప్పగించుడెట్ల .. కరెంట్​ మీటర్ ​రన్నింగ్ ​కోసం రీసైక్లింగ్

బియ్యం అప్పగించుడెట్ల .. కరెంట్​ మీటర్ ​రన్నింగ్ ​కోసం రీసైక్లింగ్
  • సీఎంఆర్ అప్పగింతపై మిల్లర్ల మల్లగుల్లాలు
  • జిల్లాలో కొనడానికి వడ్లు లేక పక్కచూపులు
  • ఇతర రాష్ట్రాల నుంచి బియ్యం కొనుగోళ్లు​
  • రేషన్ ​బియ్యంపై కూడా నజర్​ 
  • మీటర్ రన్​ కాకుండా సీఎంఆర్​ఇస్తే దొరికి పోతామని అతి తెలివి

నిజామాబాద్, వెలుగు: కస్టమ్​ మిల్లింగ్​ కోసం తీసుకున్న వడ్లను బయట అమ్ముకున్న మిల్లర్లు వాటిని తిరిగి భర్తీ చేయడానికి దొడ్డిదారిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ వైపు తమ ఏజెంట్ల ద్వారా రేషన్ ​బియ్యాన్ని కొంటూనే మరో వైపు గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి రైస్ కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ తదితర ప్రాంతాల నుంచి జిల్లాకు రైస్​రవాణా అవుతోంది. 

రేషన్ ​బియ్యంపై చూపు.. 

సీఎంఆర్​ భర్తీకి మిల్లర్లు రేషన్​ రైస్​పై నజర్​పెట్టారు. జిల్లాలో 4.2 లక్షల రేషన్​ కార్డులుండగా, 759 షాపుల ద్వారా ప్రతినెలా 6,449 మెట్రిక్ టన్నుల రైస్​ పంపిణీ అవుతుంది. బియ్యాన్ని బయట అమ్ముకునే వ్యక్తుల వివరాలను రేషన్​ డీలర్ల నుంచి సేకరించి ఏజెంట్ల ద్వారా వారిని క్యాచ్​ చేస్తున్నారు. డీలర్​కు క్వింటాల్​కు రూ.500 కమీషన్​ ముట్టజెప్పి, రూ.2,300 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. విలేజ్​కు చెందిన ఏజెంట్​కు క్వింటాల్​కు రూ.200 కమీషన్​ ఇస్తున్నారు. ఇలా ఏజెంట్లు రోజుకు రూ.5 వేల దాకా సంపాదిస్తున్నారు. సేకరించిన రైస్​ను అర్ధరాత్రి దాటిన తర్వాత సారంగాపూర్, బోధన్​ శివారులోని 12 రైస్​ మిల్లులకు వ్యాన్​లలో తరలిస్తున్నారు.

బిహార్​ నుంచి..

ఈ నెల 15న రుద్రూర్​లోని ఒక రైస్​మిల్లుకు బిహార్ నుంచి దొడ్డు బియ్యం లారీ లోడ్ వచ్చింది. సీఎంఆర్ కొరతను భర్తీ చేయడానికి ఓ మిల్లర్​అక్కడి నుంచి బియ్యం తెప్పించాడు. మరో పది రోజులు కంటిన్యూగా పది లోడ్లు తెప్పించుకోడానికి పేమెంట్​కూడా చేశాడు. జిల్లాలో 71 బాయిల్డ్, 257 రా రైస్ మిల్లులు ఉండగా నిజామాబాద్, బోధన్​ చుట్టే సగం ఉంటాయి. ఈ రెండు ఏరియాల్లోని 18 మిల్లులకు హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల నుంచి రోజు 25 లారీల రైస్ రవాణా అవుతోంది. ఈ రకంగా హైదరాబాద్​నుంచి 308 క్వింటాళ్ల బియ్యంతో వచ్చిన లారీని 15 న పట్టుకున్న పోలీసులు రూరల్​స్టేషన్​కు తరలించి కేసు నమోదు చేశారు. ఇవి రేషన్​బియ్యామా? లేక వేరేనా? అనే విషయమై దర్యాప్తు చేస్తున్నారు. 

వడ్లు లేక తిప్పలు

2022–23 ఖరీఫ్​కు సంబంధించి 22 వేల టన్నులు, అదే ఏడాది యాసంగికి చెందిన 3.12 లక్షల టన్నుల సీఎంఆర్ బియ్యం ఎఫ్ సీఐకి చేరాల్సి ఉంది. ఇప్పటికే మూడుసార్లు గడువు పొడిగించిన గవర్నమెంట్ చివరగా​ఈ నెలాఖరుకు డెడ్​లైన్​ విధించింది. తర్వాత వడ్ల విలువలో 25 శాతం పెనాల్టీ విధిస్తామని, సీఎంఆర్​ అప్పగించని మిల్లర్లపై కేసులు నమోదు​ చేస్తామని వార్నింగ్​ఇచ్చింది. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ​సర్కార్ ​సీఎంఆర్ ​పట్ల సీరియస్​గా ఉన్నందున వీలైనంత త్వరగా బియ్యాన్ని అప్పగించాలనే ఆత్రుతలో  మిల్లర్లు అడ్డదారులు తొక్కుతున్నారు.  

రీసైక్లింగ్ ​ఎత్తుగడ

గవర్నమెంట్​ ఇచ్చిన వడ్లను మరాడించి బియ్యంగా మార్చడానికి కచ్చితంగా మిల్లు నడపాల్సిందే. ఒక నెలలో వినియోగించిన కరెంట్​తో ఎంత మేర వడ్లను మరాడించిన విషయాన్ని అంచనా వేయొచ్చు. బయట నుంచి నేరుగా బియ్యాన్ని సేకరిస్తున్న మిల్లర్లు వాటిని అలాగే సీఎంఆర్​కింద తోలితే కరెంట్​ బిల్లుల్లో దొరికిపోతామని బియ్యాన్ని రీసైక్లింగ్​ చేస్తున్నారు.