- రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా
- పట్టించుకోని సివిల్ సప్లై ఆఫీసర్లు
- లక్షలు చేతులు మారుతున్న వైనం
మంచిర్యాల, వెలుగు:జిల్లాలోని పలువురు మిల్లర్లు ఎప్పటిలాగే సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) వడ్లను అమ్ముకుంటున్నారు. రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేసి సీఎంఆర్ పెడుతున్నారు. ఐదు రోజుల కిందట జైపూర్ మండలం టేకుమట్లలోని బాలాజీ రైస్మిల్లు నుంచి వడ్లను తరలిస్తుండగా స్థానికుల సమాచారంతో సివిల్ సప్లై ఆఫీసర్లు పట్టుకున్నారు. ఆ మిల్లర్ ఇప్పటికే సుమారు పది లారీల వడ్లను పెద్దపల్లి జిల్లాలోని రైస్మిల్లులకు అమ్ముకున్నట్టు సమాచారం. ఇదే రీతిలో జిల్లాలోని పలువురు మిల్లర్లు వడ్లను పక్కదారి పట్టిస్తున్నారు. అలాంటి మిల్లులపై యాక్షన్ తీసుకోవాల్సిన సివిల్ సప్లై ఆఫీసర్లు నామమాత్రంగా నోటీసులతో సరిపెడుతున్నారు. ఈ వ్యవహారంలో లక్షలు చేతులు మారుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
సీఎంఆర్ ఇలా...
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేసిన వడ్లను రైస్మిల్లులకు కేటాయిస్తుంది. మిల్లర్లు ఆ వడ్లను మిల్లింగ్ చేసి క్వింటాల్కు 68 కిలోల చొప్పున సీఎంఆర్ ఇవ్వాలి. ఇందుకు గాను ప్రభుత్వం మిల్లర్లకు మిల్లింగ్చార్జీలు చెల్లిస్తుంది. జిల్లా వ్యాప్తంగా గత యాసంగి సీజన్లో 1.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి ఆయా మిల్లులకు కేటాయించారు. మిల్లర్లు వడ్లను నిర్ణీత సమయంలో మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి సీఎంఆర్ అప్పగించాల్సి ఉంది. యాసంగి బియ్యంలో నూక శాతానికి సంబంధించి సమస్య వచ్చింది. ప్రభుత్వం మిల్లర్లకు బోనస్ ఇస్తామని ప్రకటించినప్పటికీ ఎంతన్నది ఇంతవరకు తేల్చలేదు. అలాగే కొద్దిరోజులుగా ఎఫ్సీఐ బియ్యం సేకరణను నిలిపివేసింది. దీంతో పలువురు మిల్లర్లు సీఎంఆర్ వడ్లను పక్కదారి పట్టిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలోని రైస్మిల్లులకు వందల క్వింటాళ్లు అమ్ముకుంటున్నారు.
మిల్లులపై పర్యవేక్షణ ఏది?
జిల్లాలో రైస్మిల్లులపై సివిల్ సప్లై ఆఫీసర్ల పర్యవేక్షణ కరువైంది. మిల్లుల్లో అనేక అక్రమాలు జరుగుతున్నా ఆఫీసర్లు చూసీచూడనట్టు వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కిందటి సీజన్లకు సంబంధించిన వడ్లను సైతం మిల్లర్లు అమ్ముకున్నారు. కొంతమంది వడ్లను మిల్లింగ్ చేసి బియ్యాన్ని ఓపెన్ మార్కెట్కు తరలించారు. గడువు లోపు సీఎంఆర్ పెట్టకపోవడంతో అనుమానం వచ్చిన ఎఫ్సీఐ అధికారులు జిల్లాలోని మిల్లుల్లో తనిఖీలు చేపట్టారు. తమ అక్రమాలు బయటపడుతాయనే భయంతో పలువురు తనిఖీలకు సహకరించలేదు. ధాన్యం బస్తాలను లెక్కించడానికి వీలు లేకుండా నెట్లు కొట్టి కవర్లు కప్పడం చూసి ఎఫ్సీఐ ఆఫీసర్లు కంగుతిన్నారు. మిల్లర్లకు రాజకీయ అండదండలు ఉండడం, లోపాయికారి ఒప్పందాలతో సివిల్ సప్లై ఆఫీసర్లు అటువైపు చూడడం లేదన్న విమర్శలున్నాయి.
నోటీసులతో సరి... చర్యలేవి?
జైపూర్ మండలం టేకుమట్లలోని బాలాజీ రైస్మిల్లు నుంచి వడ్లను పెద్దపల్లి జిల్లాకు తరలిస్తుండగా స్థానికులు సివిల్ సప్లై ఆఫీసర్లకు సమాచారం అందించారు. వడ్ల లారీని రాజీవ్ హైవేపై పట్టుకొని నస్పూర్ లోని ఎంఎల్ఎస్ పాయింట్కు తరలించారు. వారం రోజుల్లోపు వివరణ ఇవ్వాలంటూ మిల్లర్కు నోటీసులు జారీ చేశారు. వడ్లను తరలిస్తూ రెడ్హ్యాండెడ్గా దొరికినప్పటికీ మిల్లర్ పై యాక్షన్ తీసుకోకుండా అక్రమాలను సరిచేసుకునేందుకు అవకాశం ఇచ్చినట్లయ్యింది. అధికారులు వెంటనే మిల్లును తనిఖీ చేస్తే అక్రమాలు బయటపడేవన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ మిల్లు నుంచి సుమారు పది లారీల వడ్లు పెద్దపల్లి జిల్లాకు తరలిపోయినట్టు సమాచారం. ఇంకా చాలా మిల్లుల్లో ఉండాల్సిన వడ్ల కంటే తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో రూ.లక్షలు చేతులు మారుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రేషన్ బియ్యం రీసైక్లింగ్...
పలువురు మిల్లర్లు వడ్లను మిల్లింగ్ చేసి ఓపెన్ మార్కెట్లో కిలో బియ్యం రూ.30కి అమ్ముకుంటున్నారు. మరికొందరు ఏకంగా వడ్లనే పక్కదారి పట్టిస్తున్నారు. ప్రభుత్వం పీడీఎస్ ద్వారా పేదలకు పంపిణీ చేస్తున్న బియ్యాన్ని డీలర్లు, దళారుల దగ్గర కిలో రూ.20కి కొంటున్నారు. వీటికే పాలిష్ చేసి సీఎంఆర్ పెడుతున్నారు. బియ్యం నాణ్యత విషయంలో ఎఫ్సీఐ స్ట్రిక్ట్గా వ్యవహరిస్తుండడంతో మిల్లర్ల ఎత్తులు పారడం లేదు. దీంతో సివిల్ సప్లై ఆఫీసర్లతో కుమ్మక్కు అయి మళ్లీ పీడీఎస్ కోసం అప్పగిస్తున్నారు. తద్వారా మిల్లర్లు కిలోకు రూ.10 చొప్పున లాభపడుతున్నారు. జిల్లాలోని గుడిపల్లి, టేకుమట్ల, ఇందారం, హాజీపూర్, లక్సెట్టిపేట, దండేపల్లి ప్రాంతాల్లోని మిల్లుల్లో రీసైక్లింగ్ దందా జోరుగా సాగుతున్నట్టు తెలుస్తోంది.