- ఇజ్రాయెల్ కంపెనీ ఎన్ఎస్వో వివరణ
జెరూసలెం/వాషింగ్టన్: ఓ పక్క పెగాసస్ అంశం ప్రపంచాన్ని కుదిపేస్తుంటే.. దాన్ని తయారు చేసిన సంస్థ ఎన్ఎస్వో గ్రూప్ మాత్రం అది సూపర్ అంటూ వింత వాదన చేస్తోంది. తమ స్పైవేర్ వల్ల ప్రపంచంలోని కోట్లాది మంది హాయిగా నిద్రపోతున్నారని కామెంట్ చేసింది. ఇలాంటి టెక్నాలజీల వల్లే రోడ్ల మీద జనం భయం లేకుండా ధైర్యంగా తిరగగలుగుతున్నారని పేర్కొంది. తన క్లయింట్ల వద్ద ఉన్న సమాచారాన్ని తాము తీసుకోవట్లేదని స్పష్టం చేసింది. అందుకు పెగాసస్కు థ్యాంక్స్ చెప్పాలని పేర్కొంది. నిఘా, దర్యాప్తు సంస్థలు పెగాసస్తో టెర్రరిజం, నేరాలకు అడ్డుకట్ట వేస్తున్నాయని చెప్పింది. కట్టుదిట్టమైన ఎన్క్రిప్షన్ ఉన్న ఫోన్ల మాటున దాక్కున్న వాటన్నింటినీ పెగాసస్ పటాపంచలు చేస్తోందని తెలిపింది. చీకటి సామ్రాజ్యంలోని అక్రమ వ్యవహారాలపై నిఘా వేసేందుకు ఎలాంటి సాధనాలు లేవని, ప్రపంచంలోని ఇతర సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థలతో కలిసి ఎన్ఎస్వో ఆ టూల్స్ను తయారు చేసిందని చెప్పుకొచ్చింది. భద్రమైన ప్రపంచం కోసం తాము పనిచేస్తున్నామని వివరించింది. స్పైవేర్ను దుర్వినియోగం చేస్తున్నారని తెలిస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఎన్ఎస్వో స్పష్టం చేసింది. భద్రతా కారణాల వల్ల తమ క్లయింట్లు ఎవరు? ఎవరిపై నిఘా పెట్టారన్న వివరాలను బయటకు వెల్లడించలేమని తేల్చి చెప్పింది. ఇండియాలో పౌర సంఘాలు, ప్రభుత్వ విమర్శకులు, జర్నలిస్టులు, ప్రతిపక్షాలపై పెగాసస్తో నిఘా పెట్టడం ఆందోళన కలిగించేదేనని అమెరికా వ్యాఖ్యానించింది. అక్రమంగా నిఘా పెట్టడం దారుణమని సౌత్, సెంట్రల్ ఆసియా అఫైర్స్ శాఖ ఇన్చార్జ్ సహాయ మంత్రి డీన్ థాంప్సన్ అన్నారు.