కోల్కతా: సాధారణ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ ఎంపీ, నటి మిమి చక్రవర్తి తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామా లేఖను పార్టీ చీఫ్ మమతా బెనర్జీకి సమర్పించినట్టు తెలిపారు. తన నియోజకవర్గంలోని స్థానిక నాయకత్వంపై మిమి చక్రవర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. వారితో తలెత్తిన విభేదాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. “గురువారం మా పార్టీ చీఫ్ను కలిశాను. నా రాజీనామాను ఫిబ్రవరి 13న ఆమెకు సమర్పించాను. నాకు రాజకీయాలు సరిపడవని ఇన్నేండ్లకు అర్థమైంది. మానసిక ప్రశాంతత విషయంలో నేను రాజీపడను. సంతోషంగా లేని చోట నేను ఉండను” అని మిమి చక్రవర్తి చెప్పారు. టీఎంసీ నుంచి ఆమోదం లభించగానే రాజీనామా లేఖను లోక్ సభ స్పీకర్కు సమర్పిస్తానని మిమి చక్రవర్తి పేర్కొన్నారు.