కరీంనగర్, వెలుగు: హాస్పిటల్లో లిఫ్ట్ కేబుల్ తెగిపోయిన ఘటనలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు తృటిలో ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మార్కెట్ యార్డులో మక్కల కొనుగోలు కేంద్రం వద్ద లారీ అదుపుతప్పి మంగళవారం పలువురు రైతులు గాయపడ్డారు. వారు కరీంనగర్ లోని వన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. బుధవారం రాత్రి వారిని పరామర్శించేందుకు మంత్రి బుధవారం రాత్రి హాస్పిటల్కు వెళ్లారు. లిఫ్ట్లో ఫస్ట్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్కు వెళ్తున్నాడు. లిఫ్ట్ కొద్దిగా పైకి లేవగానే కేబుల్ తెగి కింద పడిపోయింది.
ఈ ఘటనలో కొద్దిసేపు మంత్రి లిఫ్ట్లో ఇరుక్కుపోయారు. బయటికి రాగానే ఆయన హాస్పిటల్ మేనేజ్మెంట్పై సీరియస్ అయ్యారు. భద్రతా ప్రమాణాలు పాటించరా అని ప్రశ్నించారు. పెను ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని నిలదీశారు. ఈ ఘటనపై ఆరోగ్య శాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. విచారణ చేయాలని డీఎంహెచ్ఓ వెంకటరమణను ఆదేశించారు.
