టీ తాగడం తగ్గించండి : ప్రజలకు పాక్ మంత్రి విజ్ఞప్తి

టీ తాగడం తగ్గించండి :  ప్రజలకు పాక్ మంత్రి విజ్ఞప్తి

ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థ సంక్షోభం దిశగా వెళ్తున్న క్రమంలో ఆ దేశ మంత్రి ప్రజలకు ఓ ఉచిత సలహా ఇచ్చాడు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలతో సతమతమవుతున్న పౌరులకు...పాక్‌ మంత్రి ఓ సందేశం ఇచ్చాడు. టీ తాగడం తగ్గించాలని దేశ ప్రజలను కోరాడు. టీని కూడా అప్పుగా దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో ప్రజలను టీ తాగడం తగ్గించాలని మంత్రి అహ్సాన్‌ ఇక్బాల్‌ విజ్ఞప్తి చేశాడు.

పాకిస్తాన్ లో విదేశీ మారక నిల్వలు తగ్గడంతో దిగుమతుల బిల్లును తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి అహ్సాన్‌ ఇక్బాల్‌ పేర్కొన్నాడు. నగదు కొరతతో సతమతమవుతున్న నేపథ్యంలో టీ వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రజలను కోరాడు. 2021, 22 ఆర్థిక సంవత్సరంలో పాక్‌ సుమారు రూ.2 వేల కోట్ల టీని వినియోగించిందని తేలడంతో ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. ప్రపంచంలో టీని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో ఒకటైన పాక్‌ టీని దిగుమతి చేసుకోవడానికి కూడా అప్పులు చేయాల్సి వస్తుందని చెప్పాడు.

గతేడాది కంటే రూ. 400 కోట్ల టీని పాక్‌ అధికంగా దిగుమతి చేసుకుందని తెలిపాడు. అయితే.. పాక్‌ మంత్రి చేసిన విజ్ఞప్తి సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజన్లు తమదైన స్టైల్లో స్పందించారు. పాక్‌ ప్రభుత్వ తీరును, మంత్రి తీరును విమర్శిస్తూ తమదైన శైలిలో చురకలంటించారు. ‘నిజంగానే ఈ మాట అడుగుతున్నారా..? మేం అంత వెర్రివాళ్లమని అనుకుంటున్నారా..?’ అని కొందరు కామెంట్లు చేస్తుంటే.. ‘మేం ఇలాంటి పనులు చెయ్యలేం’ అని మరికొందరు కరాఖండీగా చెప్పేస్తున్నారు. ఇటీవలే ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ కూడా ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థ శ్రీలంక ఆర్థిక వ్యవస్థలా మారిపోతుందంటూ హెచ్చరించాడు.