
హైదరాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడిన చిన్నారి సహస్రకు ఉచితంగా వైద్యం అందించాలని అధికారులను హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఈ నెల 5న జరిగిన ప్రమాదంలో సహస్ర తల్లిదండ్రులు మరణించారు. చిన్నారి పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో కరీంనగర్కు తరలించారు. మంత్రి దామోదర ఆదేశాలతో మంగళవారం హైదరాబాద్ రెయిన్ బో హాస్పిటల్ కు తీసుకొచ్చారు.
సహస్రకు పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. ట్రీట్మెంట్ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. మంత్రి ఆదేశాలతో హైదరాబాద్ డీఎంహెచ్వో, డాక్టర్ వెంకట్ రెయిన్బో హాస్పిటల్కు వెళ్లి సహస్ర ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. చిన్నారి వెన్నుపూసకు ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని ఆమె కుటుంబసభ్యులకు డాక్టర్లు వివరించారు. సహస్రకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు డీఎంహెచ్వో వెంకట్ సూచించారు.