వరంగల్: కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళందరికీ మెరుగైన చికిత్స అందిస్తామన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మంగళవారం వరంగల్ లోని KMC (కాకతీయ మెడికల్ కాలేజి)లో PMSSY పథకం క్రింద నిర్మించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నూతన భవన నిర్మాణ పనులను మంత్రి ఎర్రబెల్లి , చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, జిల్లా ఇంచార్జి కలెక్టర్ హరిత, ఏంసి ప్రిన్సిపాల్ సంధ్య, ఇంఛార్జి ఎంజిఎం సూపరింటెండెంట్ నాగార్జునలు పరిశించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా రోగులకు మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కరోనా రోగులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరమైతే మరిన్ని బెడ్స్ పెంచి అందరికీ చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి పేర్కోన్నారు. ఈనెల 12 న ఈ నూతన భవనాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈ ఈటెల రాజేందర్ చేత ప్రారంభిస్తామని చెప్పారు. ఆక్సిజన్ తోయుక్తంగా 120 బెడ్ లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆసుపత్రిలో కరోనా పేషెంట్లు అందరికీ మెరుగైన చికిత్స కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. నాణ్యమైన భోజనం అందించేందుకు పాత కాంట్రాక్టర్ ను తొలగించి కొత్త కాంట్రాక్టరు నియమించినట్లు చెప్పారు. ఎంజిఎంలో డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు బాగానే పని చేస్తున్నారన్నారు. కొందరు పని చేయక పోతే క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటాం కానీ ఆసుపత్రిలో ఎవ్వరూ పని చేయడం లేదని ప్రచారం చేయటం సరి కాదని అన్నారు మంత్రి.