- కలెక్టర్ అభిలాష అభినవ్
- విజయవంతంగా మాక్ ఎక్సర్సైజ్
నిర్మల్, వెలుగు: ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలను ఆదుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(ఎన్ఎండీఏ), రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్ లోని జీఎన్ఆర్ కాలనీలో విపత్తు నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించగా కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారీ వర్షాలు, వరదలు సంభవించినప్పుడు ప్రజలను కాపాడేందుకు ప్రజల భాగస్వామ్యం, అధికారుల మధ్య సమన్వయం కోసం మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించినట్లు తెలిపారు. వరదలతో ముంపులో చిక్కుకున్న ప్రజలను రక్షించడం, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రథమ చికిత్స అందించడం, ఆస్పత్రికి తరలించడం, పునరావాసం కల్పించడం, భోజనం తదితర అంశాలను వలంటీర్ల భాగస్వా మ్యంతో చేపట్టడడంపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
అడిషనల్ కలెక్టర్ కిశోర్ కుమార్, జిల్లా అగ్నిమాపక అధికారులు ప్రభాకర్, శివాజీ, వివిధ శాఖల జిల్లా అధికారులు జీవరత్నం, నరసింహారెడ్డి, రాజేందర్, శ్రీకాంత్ రెడ్డి, తహసీల్దార్లు రాజు, ప్రభాకర్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, ఎస్ డీఆర్ఎఫ్ బృందం తదితరులు పాల్గొన్నారు.
