తెలంగాణ పై కేంద్రం వివక్ష చూపిస్తోంది

తెలంగాణ పై కేంద్రం వివక్ష చూపిస్తోంది

జనగామ, వెలుగు: బీజేపీ లీడర్లంత మూర్ఖులు దేశంలోనే లేరని పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో ఫీల్డ్ అసిస్టెంట్లంతా బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం జనగామలో నిర్వహించిన ఉపాధి హామీ పథకం ఉద్యోగుల రాష్ర్ట స్థాయి ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి హాజరై మాట్లాడారు. బీజేపీ నేతలను తరిమికొట్టేందుకు అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. గత పాలకుల హయాంలో తాగు, సాగు నీటికి జనం తీవ్ర ఇబ్బందులు పడేవారని, కేసీఆర్​ పాలనలో ఇప్పుడు అంతా సస్యశ్యామలంగా మారిందన్నారు.

తెలంగాణ పై కేంద్రం వివక్ష చూపిస్తోందని, ఈజీఎస్ పథకాన్ని ఎత్తేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్ లోనూ ఈజీఎస్ కు కేంద్రం నిధులు తగ్గించిందన్నారు. మిగతా రాష్ట్రాల్లో ఈజీఎస్​ రోజువారీ కూలీ రూ.140 ఉండగా, మన రాష్ట్రంలో  రూ.250 వరకు ఉందన్నారు. అభివృద్ధిని మరిచిన  బీజేపీకి దూరంగా ఉండాలన్నారు.