కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు

 కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు

వరంగల్ : హన్మకొండలోని ఆర్ట్స్, సైన్స్ కళాశాల మైదానంలో బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో నాయకులు చేసిన ప్రసంగాలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రసంగాల్లో ఏ మాత్రం పసలేదని కొట్టి పారేశారు. మూడో విడత ప్రజాసంగ్రామ యాత్రలో బండి సంజయ్ తెలుసుకున్న ప్రజా సమస్యలు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. -రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ పాదయాత్రలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. -బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతుబంధు, రైతుబీమా, పెన్షన్లు వస్తున్నాయా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా..? అని వ్యాఖ్యానించారు. 

‘కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి సవాల్ చేస్తున్నాను. మీరు, నేను కలిసి బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పాదయాత్ర చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు  బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలవుతే నేను క్షమాపణలు చెబుతాను. లేదంటే మీరు తప్పు జరిగిందని ఒప్పుకుంటారా..?’ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ఉండి అబద్దాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -రాష్ర్టంలోని సంక్షేమ పథకాల అమలు తీరును కేంద్ర ప్రభుత్వమే ప్రశంసిస్తూ.. అవార్డులు కూడా అందిస్తోందన్నారు. దేశంలోని ఏ రాష్ర్ట ప్రభుత్వం ఇవ్వని విధంగా తెలంగాణ ప్రభుత్వం కానిస్టేబుళ్లు, హోంగార్డులకు అత్యధిక జీతాలు ఇస్తోందని చెప్పారు. కుల, మతాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు.