
హైదరాబాద్, వెలుగు: పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్తో మంత్రి వివేక్ వెంకటస్వామి సమావేశమయ్యారు. గనులు, కార్మిక శాఖ మంత్రిగా నియమితులయ్యాక శుక్రవారం మొదటిసారి గాంధీభవన్కు వచ్చిన ఆయనకు పలువురు పార్టీ నేతలు, కార్యాలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి వివేక్ను పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ చాంబర్ వద్దకు తోడ్కొని వెళ్లారు. ఈ సందర్భంగా వివేక్కు మహేశ్ గౌడ్ శాలువా కప్పి, బొకే ఇచ్చి అభినందనలు తెలిపారు. వివేక్ కూడా మహేశ్కు బొకే ఇచ్చి శాలువాతో సత్కరించారు.
అనంతరం ఇరువురు నేతలు సుమారు అరగంటకు పైగా సమావేశమయ్యారు. ఈ భేటీలో పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపై చర్చించుకున్నట్టు తెలిసింది. ఇటు పార్టీలోనూ, అటు ప్రభుత్వంలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దపీట వేస్తున్న విషయమూ చర్చకు వచ్చినట్లు సమాచారం. త్వరలో లోకల్బాడీ ఎన్నికలు ఉన్నందున ప్రభుత్వం ఏడాదిన్నరగా అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలను జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని వివేక్ను మహేశ్ గౌడ్ కోరినట్టు తెలిసింది. తాము ఇప్పటికే ఇదే పనిలో తలమునకలయ్యామని, స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్చేసే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని మంత్రి చెప్పినట్టు సమాచారం.