కాంగ్రెస్ వస్తే ఆరు నెల్లకో సీఎం : మంత్రి హరీశ్ రావు

కాంగ్రెస్ వస్తే ఆరు నెల్లకో సీఎం : మంత్రి హరీశ్ రావు

కోహెడ,  వెలుగు: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు నెల్లకో సీఎం మారుతాడని, కుర్చీ కోసమే వారి తండ్లాటని, ప్రజలను పట్టించుకునే నాథుడే ఉండరని మంత్రి హరీశ్​రావు విమర్శించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కోహెడ లో బీఆర్ఎస్ హుస్నాబాద్ అభ్యర్ధి వొడితెల సతీశ్ కుమార్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్, టీడీపీ, ఎర్రజెండాల హయాంలో తెలంగాణ ఎట్లుండే బీఆర్ఎస్ వచ్చాక ఎట్లయిందో ప్రజలు ఆలోచించాలన్నారు.

ఎన్నికలు రాగానే కాంగ్రెసోళ్లు ఊళ్ల పొంటి బయలు దేరారని వాళ్ల కల్లబొల్లి మాటలు నమ్మొద్దని కోరారు. కరోనా వచ్చినప్పుడు కాంగ్రెసోళ్లు ఎక్కడున్నారని ప్రశ్నించారు. 6 గ్యారంటీల పేరుతో మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నరని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కర్నాటకలో 5 గ్యారంటీల తో అక్కడి ప్రజలను ఆగం చేశారన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 3గంటల కరెంట్ ఇస్తే 3ఎకరాలు పారుతుందని, 10హెచ్ పీ మోటార్లు పెట్టుకోవాలని అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నాడన్నారు.

ఇప్పటికే బీఆర్ఎస్ మేనిఫెస్టోను కాపీ కొట్టారనీ ఆఖరుకు రామక్క పాటను కూడా కాఫీ కొట్టారన్నారు.  కార్యక్రమంలో ఎన్నికల ఇన్‌చార్జి ఇనుగుల పెద్దిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, పేర్యాల రవీందర్ రావు, ఎంపీపీ కీర్తి,  జడ్పీటీసీ శ్యామల, సింగిల్ విండో చైర్మన్​ దేవేందర్ రావు, ఏఎంసీ చైర్మన్​జ్యోతి, సర్పంచ్ నవ్య, మండల అధ్యక్షుడు మహేందర్, రాజేశ్వర్ రావు, రాజిరెడ్డి పాల్గొన్నారు.

రైతు రుణమాఫీ పూర్తికాలె..

హుస్నాబాద్: రైతు రుణమాఫీ చేస్తుండగానే ఎన్నికల కోడ్​ రావడంతో మధ్యలో ఆగిపోయిందని, పేదోళ్లకు పూర్తిస్థాయిలో ఇండ్లు కట్టించలేకపోయామని మంత్రి హరీశ్​రావు అన్నారు.  మంగళవారం హుస్నాబాద్, అక్కన్నపేట, చిగురుమామిడి మండలాల్లో నిర్వహించిన రోడ్​షోలో మాట్లాడారు. 'ఉన్న మాటే అంటున్న. నిజాలు మాట్లాడాలె. ఎలక్షన్​ కోడ్​ అడ్డు రావడంతో రైతు రుణమాఫీ పూర్తిచేయలేకపోయినం. ఇంకా చారానామందం రైతులే మిగిలి ఉన్నారు. వాళ్లకు కూడా డబ్బులు ఇస్తామని ఎలక్షన్​ కమిషన్​కు లెటర్​ రాసినం. వాళ్లు పర్మిషన్​ ఇవ్వలే. పర్మిషన్​ రాంగనే రుణమాఫీ పూర్తిచేస్తం.

ALSO READ : మన్సూర్ అలీఖాన్ పై పోలీసులు కేసు నమోదు