
- ఇప్పటివరకు 1.61 కోట్ల మందికి పరీక్షలు పూర్తి చేశామని వెల్లడి
- కంటి వెలుగు’కు 100 రోజులు పూర్తి.. కేక్ కట్ చేసిన మంత్రి
- ఈ ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది: హరీశ్రావు
హైదరాబాద్, వెలుగు: కంటి పరీక్షలు చేయించాలని ప్రజలు అడగకపోయినా ‘కంటి వెలుగు’కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి హరీశ్రావు అన్నారు. ఈ ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. కంటి వెలుగు రెండో దశ స్ర్కీనింగ్ 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్రెడ్డి, ప్రశాంత్రెడ్డితో కలిసి సెక్రటేరియెట్లోని తన చాంబర్లో హరీశ్ రావు కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి, కేసీఆర్ గొప్ప మనసును చాటుకున్నారన్నారు. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం లేదన్నారు. ఈ 100 రోజుల స్క్రీనింగ్లో 1.61 కోట్ల మందికి కంటి పరీక్షలు చేయించామని, అందులో 40.59 లక్షల మందికి కంటి సమస్యలు ఉన్నట్లుగా గుర్తించి అద్దాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 24 జిల్లాల్లో రెండో దశ పూర్తవగా, మిగిలిన 9 జిల్లాల్లో ఇంకా కొనసాగుతోందని వెల్లడించారు.
కిషన్రెడ్డి ప్రజంటేషన్ అబద్ధాల పుట్ట
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు కేంద్రం నుంచి వచ్చిన నిధుల పేరుతో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ అబద్ధాల పుట్ట అని హరీశ్ రావు అన్నారు. కిషన్ రెడ్డికి కన్ఫ్యూజన్ ఎక్కువ కాన్సట్రేషన్ తక్కువని, ఫ్రస్ట్రేషన్తో పచ్చి అబద్ధాలు చెప్పారని ఒక ప్రకటనలో మండిపడ్డారు. త్వరలోనే దీనిపై తామూ పవర్ పాయింట్ ప్రజంటేషన్తోనే ప్రజలకు వివరిస్తామన్నారు. ని గతంలో అమిత్ షా చెప్పిన అబద్ధాలనే కిషన్ రెడ్డి రిపీట్ చేశారని, పనికొచ్చే విషయం ఒక్కటీ మాట్లాడలేదన్నారు.