జాకీలు పెట్టినా బీజేపీ లేవదు..కాంగ్రెస్ గెలవదు : మంత్రి హరీష్​ రావు

జాకీలు పెట్టినా బీజేపీ లేవదు..కాంగ్రెస్ గెలవదు : మంత్రి హరీష్​ రావు

సంగారెడ్డి : రేపో, మాపో BRS మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు మంత్రి హరీష్​ రావు. ప్రజలకు ఇంకా ఏం చేయాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని చెప్పారు. ఎవరెన్ని కుట్రలు చేసినా హ్యాట్రిక్ మాత్రం సీఎం కేసీఆర్ దే అన్నారు. BRS ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. రైతులకు 3 గంటల కరెంట్ చాలని కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై కాంగ్రెస్ పార్టీకి ప్రేమ లేదన్నారు. త్వరలోనే బిడెకన్నే గ్రామాన్ని దత్తత తీసుకుంటానని చెప్పారు. 

తప్పిపోయో లేదంటే పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే కైలాసంలో పెద్దపాము మింగినట్టే ఉంటుందని అన్నారు. కన్నతల్లికి అన్నం పెట్టలేనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నాడట అంటూ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ ఫేక్ సర్వేలు పెడుతోందని ఆరోపించారు.

జాకీలు పెట్టినా తెలంగాణలో బీజేపీ లేవదు.. కాంగ్రెస్  గెలవదు అన్నారు. కేసీఆర్ దెబ్బకు బీజేపీ డక్ ఔట్..కాంగ్రెస్ రన్ ఔట్..కేసీఆర్ సెంచరీ ఖాయం అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి 30 స్థానాల్లో అభ్యర్థులే లేరని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చుడే ఎక్కువ అని కామెంట్స్ చేశారు. గత ఎన్నికల్లో 88 సీట్లు గెలిచామని, ఈ సారి 100 సీట్లు గెలిచి సెంచరీ కొడుతామన్నారు.