
- హిమాచల్ సీఎం వాస్తవాలు తెలియకుండా మాట్లాడారు
- జానారెడ్డి, ఉత్తమ్, వెంకట్రెడ్డి నల్గొండ జిల్లాకు ఏం చేశారు?
- మిర్యాలగూడ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి
నల్గొండ, వెలుగు : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 40 స్థానాల్లో అభ్యర్థులే లేరని మంత్రి హరీశ్రావు అన్నారు. పోటీ చేసేందుకు క్యాండిడేట్లు లేకున్నా అధికారంలోకి వస్తామని ఆ పార్టీ లీడర్లు పగటికలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేది ముమ్మాటికీ బీఆర్ఎస్సేనని ఆయన అన్నారు. శుక్రవారం మిర్యాలగూడలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్ పాల్గొని మాట్లాడారు. అంతకుముందు మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి ప లు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థా పనలు చేశారు. తెలంగాణలో నిరుద్యోగాన్ని పెం చి పోషించిందే కాంగ్రెస్ అని ఆరోపించారు. హి మాచల్ప్రదేశ్ సీఎం వాస్తవాలు తెలియకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని, ఆ రాష్ట్రం నుంచి ఎంతో మంది బతుకుదెరువు కోసం తెలంగాణకు వలస వచ్చారన్నారు. ‘నువ్వు మాకు నీతులు చెప్ప కు.. ఇక్కడ నేర్చుకుని వెళ్లాలి’ అని మండిపడ్డారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు రద్దు!
ఏండ్ల తరబడి పదవుల్లో ఉన్న జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి కోసం ఏం చేశారని హరీశ్ రావు ప్రశ్నించారు. కనీసం బత్తాయి, నిమ్మ మార్కెట్లు ఏర్పాటు చేయలేకపోయారని, ఒక్క మెడికల్ కాలేజీనైనా సాధించలేదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నల్గొండ, నకిరేకల్లో బత్తాయి, నిమ్మ మార్కెట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో పదేండ్ల కాంగ్రెస్ పాలనలో 24వేల ఉద్యోగాలకు నోటిఫి కేషన్ ఇస్తే అందులో తెలంగాణకు కేవలం 6 వేల ఉద్యోగాలు మాత్రమే దక్కాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు, రైతుబీమా రద్దు అవుతాయన్నారు. కేసీఆర్ పాలన గురించి ప్రతిపక్ష పార్టీలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయని హరీశ్రావు విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిపై విషం చిమ్ముతున్న ప్రతిపక్షాలకు అభివృద్ధి అస్త్రంతోనే బీఆర్ఎస్ కార్యకర్తలు బుద్ధి చెప్పాలన్నారు.
ముసలి సింహాలు గాండ్రిస్తున్నయ్ : జగదీశ్రెడ్డి
"కాంగ్రెస్ పాలనలో తమ కుర్చీలను కాపాడుకునేందుకే పరిమితమైన ముసలి సింహాలు ఇప్పుడు కూర్చొని గాండ్రిస్తున్నాయి"అని మంత్రి జగదీశ్ రెడ్డి విరుచుకుపడ్డారు. కేసీఆర్ పుణ్యాన పీసీసీ, తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవులు అనుభవిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 12 స్థానాల్లో గెలిచి నల్గొండను కేసీఆర్ ఖిల్లాగా మారుస్తామని చెప్పారు. దామచర్లలో యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు కంప్లీట్ అయితే మిర్యాలగూడ ఎంతో అభివృద్ధి చెందుతుందని, దామచర్ల ప్రాంతం కూడా మున్సిపాలిటీలో కలిసి కార్పొరేషన్ స్థాయికి ఎదుగుతుందన్నారు. మిర్యాలగూడను వీలైతే కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే భాస్కర్రావు కోరారు.