నర్సాపూర్ -జి గ్రామస్తులపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం

నర్సాపూర్ -జి గ్రామస్తులపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం

నిర్మల్ జిల్లా నర్సాపూర్ -జి గ్రామస్తులపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకమ్మ చీరల పంపిణీకి వెళ్లిన మంత్రి మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులకు దళిత బంధు ఇవ్వాలని కోరుతూ.. ఈ మధ్యే మంత్రి క్యాంప్ ఆఫీస్ తో పాటు కలెక్టరేట్ ను నర్సాపూర్ -జి గ్రామస్తులు ముట్టడించారు. ఈ క్రమంలో నర్సాపూర్ జి గ్రామానికి బతుకమ్మ చీరల పంపిణీ చేసేందుకు వెళ్లిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. తమకు ఇష్టం వచ్చిన వాళ్లకు దళిత బంధు ఇస్తాం అంటూ మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బంధు వచ్చే వరకు ఓపిక లేకుంటే ఏం చేయలేం అంటూ కామెంట్స్ చేశారు. 

‘ఇచ్చింది ఎక్కువైతే ఇలాగే ఉంటది.. ఒక్కసారిగా 10 లక్షలు ఇస్తే ఏం చేస్తావో చూపెట్టు’ అని ఓ మహిళను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిలదీశారు. దళిత బంధు అర్హులకు రాలేదని అడిగిన ఓ మహిళను బయటకు వెళ్లిపొమ్మని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దళిత బంధుతో కార్లు, ట్రాక్టర్లు కొంటే అవి అన్నం పెడుతాయా..? రూ.10 లక్షలతో ఏం చేసి బతుకుతారు..? మీకు ఏం అనుభవం ఉంది. చెబితేనే దళిత బంధు ఇస్తాం. దళిత బంధు మీకు మేమియ్యం. కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ల నుండే తీసుకోండి. బీజేపీ వాళ్లతో తిరుగుతున్నారు కదా. వాళ్ల దగ్గరి నుండి దళిత బంధు తెచ్చుకోండి’ అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సీరియస్ అయ్యారు.