
- విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి జూపల్లి సమీక్ష
నాగర్ కర్నూల్, వెలుగు: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులు ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి రానీయకుండా, అప్లై చేసుకున్న రైతులందరికీ కనెక్షన్లు ఇవ్వాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. బుధవారం సెక్రటేరియట్లో కొల్లాపూర్ నియోజకవర్గ విద్యుత్ సమస్యలపై మంత్రి రివ్యూ నిర్వహించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, లైన్ల నిర్మాణం, పవర్ ట్రాన్స్ ఫార్మర్ల కెపాసిటీ పెంపు, సబ్ స్టేషన్లలో అదనపు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, పాత ట్రాన్స్ఫార్మర్ల కెపాసిటీ పెంపు తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు.
డిమాండ్ మేరకు కొత్త సబ్స్టేషన్ల ఏర్పాటుపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా అధికారులు పని చేయాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో కనెక్షన్లు, పోల్స్, వైర్లు, ట్రాన్స్ఫార్మర్ల కోసం రైతులు ఇబ్బంది పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. డిమాండ్ను బట్టి కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కొల్లాపూర్ ఆసుపత్రిలో విద్యుత్ సరఫరాలో తరచూ సమస్యలు తలెత్తుతున్నాయని, కరెంట్ కోతల కారణంగా డయాలసిస్ పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ, నాగర్ కర్నూల్ ఎస్ఈ, డీఈలు పాల్గొన్నారు.