మళ్లీ నంది అవార్డులు ఇస్తం : మంత్రి జూపల్లి

మళ్లీ నంది అవార్డులు ఇస్తం : మంత్రి జూపల్లి
  • పదేండ్లు ఈ కార్యక్రమం ఆగిపోవడం బాధాకరం: మంత్రి జూపల్లి
  • ఘనంగా సినీ నటి సి.కృష్ణవేణి శతవసంత మహోత్సవం

హైదరాబాద్​, వెలుగు: ఉమ్మడి రాష్ట్రంలో సినిమా పరిశ్రమకు ఇచ్చే నంది అవార్డుల ప్రదానం తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఆగిపోవడం బాధాకరమని, దీనిపై సీఎంతో చర్చించి అవార్డులు ఇచ్చే విధంగా కృషి చేస్తానని రాష్ట్ర టూరిజం సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కళాకారులకైనా, క్రీడాకారులకైనా ప్రోత్సాహం ఎంతైనా అవసరమని, ఇందుకోసం తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. సినీ నటి, గాయని, నిర్మాత  సి. కృష్ణవేణి శత వసంత మహోత్సవం సోమవారం హైదరాబాద్​ బంజారా హిల్స్ లోని ప్రసాద్ లాబ్స్ ప్రివ్యూ థియేటర్ లో నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని.. కృష్ణవేణిని ఘనంగా సత్కరించారు. తెలుగు చలన చిత్ర రంగానికి ఆమె చేసిన సేవలను కొనియాడారు. ఎందరో నటీనటుల భవితవ్యాన్ని కృష్ణవేణి తీర్చిదిద్దారని గుర్తుచేశారు. కృష్ణ వేణి లాంటి ఒక  సినీ దిగ్గజ నటిని సత్కరించడం చాలా ఆనందంగా ఉందని మంత్రి అన్నారు. సినీ నటుడు మురళీ మోహన్ మాట్లాడుతూ..  ప్రభుత్వం తరఫున ఇచ్చే నంది అవార్డులను సినీ నటీనటులు ఎంతో గౌరవంగా భావిస్తారని, గత పదేండ్లుగా ఈ  ప్రక్రియ ఆగిపోవడం బాధాకరమని, తిరిగి నంది అవార్డులు ప్రదానం చేసేలా చొరవ చూపాలని మంత్రి జూపల్లి కృష్ణారావును కోరారు. ఇందుకు మంత్రి స్పందిస్తూ.. తప్పకుండా సీఎంతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రముఖ సినీ తారలు జయసుధ, రోజా రమణి తదితరులు పాల్గొన్నారు.