హైదరాబాద్, వెలుగు: పర్యాటకం అంటే కేవలం ఆదాయ వనరు మాత్రమే కాదని.. మన ప్రాచీన సంస్కృతి, వారసత్వాన్ని ప్రపంచానికి ఆవిష్కరించే మాధ్యమమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రతి కార్పొరేట్ సంస్థ ఒక్కో పర్యాటక ప్రదేశాన్ని దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు. బుధవారం ఆయన హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించిన దక్షిణ భారత అతిపెద్ద సీఎస్ఆర్(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) సమిట్ రెండో ఎడిషన్కు ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు.
‘‘ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు తెలంగాణకు వస్తున్నారు. మన సంప్రదాయాలు, పండుగలు, హస్తకళలు, వంటకాలు ప్రపంచవ్యాప్తంగా పేరుపొందాయి. పర్యాటకం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతున్నది. కార్పొరేట్ విజయాన్ని సామాజిక ప్రగతితో కలిపే వారధే సీఎస్ఆర్. వారసత్వ కట్టడాల సంరక్షణ, యువత నైపుణ్యాభివృద్ధి, సంప్రదాయ కళల ప్రోత్సాహం, పర్యావరణ పరిరక్షణలో ఇది కీలకం.
పర్యాటక ప్రదేశాల్ని దత్తత తీసుకోండి. ఇది కేవలం ఆర్థిక సహకారం కాదు. బాధ్యతతో కూడిన భాగస్వామ్యం. ప్రభుత్వం కూడా దత్తత తీసుకున్న సంస్థలకు తగిన గుర్తింపు ఇస్తుంది’’ అని పేర్కొన్నారు. ఈ సమిట్లో 300కు పైగా కార్పొరేట్ సంస్థలు, 100 ఎన్జీఓలు పాల్గొన్నాయన్న మంత్రి.. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన వినిల్ రెడ్డి నాయకత్వాన్ని అభినందించారు. ‘బచ్పన్ బచావో’ సంస్థను కమ్యూనిటీ పార్ట్నర్గా ఎంపిక చేసినందుకు ప్రశంసించారు.
