వనపర్తి/కోడేరు, వెలుగు : ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టుకోవాలని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగిస్తూ అధిక విస్తీర్ణంలో పంటలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎక్సయిజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన డి-8 కెనాల్ పరిధిలోని తూడుకుర్తి దగ్గర ప్రధాన కాల్వ నుంచి సాకల్పల్లి, ఏదుట్ల, గోపాలపేట, రేమద్దుల, సింగాయిపల్లి, తురకపల్లి, గోపులాపురం కాల్వలను పరిశీలించి నీటి ప్రవాహం, కాల్వల పరిస్థితిని పర్యవేక్షించారు.
కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలకు విడుదల చేస్తున్న నీరు, ఆయకట్టు పరిస్థితిపై సాగునీటిపారుదల శాఖ అధికారులను ఆరా తీశారు. ఆయకట్టు చివరి భూముల వరకు సాగునీరు చేరుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలకు నీటి విడుదల, నీటి ప్రవాహం, ఆయకట్టు పరిస్థితిపై సాగునీటిపారుదల శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. నీరు వృథా కాకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవడంతో పాటు, ఆయకట్టు చివరి భూములకు సైతం సక్రమంగా నీరు అందేలా చూడాలని సూచించారు. మంత్రి వెంట వనపర్తి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ , ఇరిగేషన్ ఇంజినీర్లు తదితరులు ఉన్నారు.
24న మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రాక
వీపనగండ్ల : ఈ నెల 24న రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీపనగండ్లకు వస్తున్నారని, వీపనగండ్ల నుంచి పాన్గల్ మండలం కేతెపల్లికి డబుల్రోడ్డుకు, రూ.2కోట్లతో నిర్మించే పంక్షన్ హాల్లకు ఆయన శంకుస్థాపన చేస్తారని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గురువారం పానగల్ నుంచి వీపనగండ్ల మండల కేంద్రం మీదుగా చిన్నంబావి మండలానికి పోతున్న దారిలో నాయకులతో ప్రజలతో టీ తాగుకుంటూ మంత్రి పలు సమస్యలపై ఆరా తీశారు. డ్రింకింగ్ వాటర్ ఫిల్టర్ అయితలేదని నాయకులు ఆయన దృష్టికి తేగా వెంటనే డీఈ, ఏఈలకు మంత్రి ఫోన్ చేసి ఆ ఫిల్టర్ బెడ్లు క్లీన్ చేసి మంచి నీరు అందించాలని ఆదేశించారు. అనంతరం చిన్నంబావి మండల పరిధిలోని చిన్న మారు లిఫ్ట్ను మంత్రి ప్రారంభించారు.
