- హరీశ్రావును నిలదీసిన మంత్రి జూపల్లి
- 300 టెండర్లలో కాంట్రాక్టర్లంతా ఒక శాతంలోపు కోట్ చేయడం విచిత్రం
- ఇందులోని లోగుట్టు కేసీఆర్, హరీశ్రావుకు తెలియదా అని ప్రశ్న
హైదరాబాద్, వెలుగు: మాయ మాటలతో జనాన్ని నమ్మించలేరని, గట్టిగా మాట్లాడినంత మాత్రాన అబద్ధాలు నిజాలైపోవని హరీశ్రావుపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైరయ్యారు. శనివారం అసెంబ్లీలో నీటిపారుదల రంగంపై శ్వేతపత్రం సందర్భంగా హరీశ్ రావు తీరుపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయంలో అవినీతి జరి గిందో లేదో హరీశ్రావు సూటిగా చెప్పాలన్నారు. చిత్తశుద్ధి, ఆత్మసాక్షి ఉంటే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని జూపల్లి డిమాండ్ చేశారు.
సాగునీటి ప్రాజెక్టుల టెండర్లలో అవకతవకలు జరిగాయని, కొంతమంది కాంట్రాక్టర్లకు అనుచిత లబ్ధి చేకూర్చేందుకు తక్కువ ధరకే టెండర్లు దక్కేలా చేశారన్నారు. నీటిపారుదల రంగంలో 1.80 లక్షల కోట్లతో టెండర్లు చేపట్టారని, పిలిచిన 300 టెండర్లలో కాంట్రాక్టర్లందరూ ఒక శాతం లోపు కోట్ చేయడం విచిత్రంగా ఉందన్నారు. ఇందులోని లోగుట్టు కేసీఆర్, హరీశ్రావుకు తెలియదా అని జూపల్లి ప్రశ్నించారు. అవినీతి జరగలేదని రుజువు చేయాలని, వీటి నుంచి ఎలా తప్పించుకుంటారని మండిపడ్డారు. రాజీనామా చేస్తానని గట్టిగా చెప్పినంత మాత్రాన తప్పు ఒప్పు కాదు అని అన్నారు. మాటలతో నమ్మించలేరని, చేతల ద్వారా మెప్పించాలని జూపల్లి పేర్కొన్నారు.