
హైదరాబాద్, వెలుగు: అంతర్జాతీయ ఆటగాళ్లను ఆకర్షించడంతోపాటు తెలంగాణను గోల్ఫ్ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ప్రపంచ గోల్ఫర్లకు హైదరాబాద్ ను ప్రీమియర్ గమ్యస్థానంగా మార్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. శుక్రవారం తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ టోర్నమెంట్ -2025 ముగింపు వేడుకల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు.
పర్యాటక అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని.. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని ప్రపంచ పర్యాటకులకు ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నామన్నారు. అనంతరం విజేత బంగ్లాదేశీ గోల్ఫర్ జమాల్ హుస్సేన్ కు రూ.15 లక్షలు, రన్నరప్ అక్షయ శర్మకు రూ.10 లక్షల ప్రైజ్మనీ అందజేశారు. కార్యక్రమంలో హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ అధ్యక్షుడు బీవీకే రాజు, పీజీటీఐ సీఈవో అనుదీప్ జైన్, డైరెక్టర్ వికాస్సింగ్, తదితరులు పాల్గొన్నారు.
కళాకారుల సమస్యల పరిష్కారానికి కృషి
తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ప్రతినెలా ఒక నిర్ణీత తేదీన వేతనాలు, పీఆర్సీ అమలు, వాహన సదుపాయం, తదితర సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. శుక్రవారం రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వం- భాషా సాంస్కృతికశాఖ సారథి కళాకారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సాంస్కృతిక సారథి కళాకారులకు హెల్త్ కార్డులు, మృతిచెందిన కళాకారుల కుటుంబాలకు పరిహారం, మెటర్నిటీ లీవులు, ఏరియర్స్, ఇందిరమ్మ ఇండ్లు, బస్ పాసులు వంటి అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లి.. పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం తెలంగాణ ప్రజా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై రూపొందించిన పాటల సీడీని మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ సంచాలకుడు ఏనుగు నర్సింహా రెడ్డి, సాంస్కృతిక కళా సారథి చైర్ పర్సన్ డా.వెన్నెల గద్దర్, కళాకారులు పాల్గొన్నారు.