అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి

అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
  • మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి  

నల్గొండ అర్బన్, వెలుగు : అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్​ప్రభుత్వం కృషి చేస్తుందని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం నల్గొండలోని అప్పాజీపేట గ్రామం నుంచి మిర్లోనిగూడెం వరకు రూ.కోటితో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులు, నల్గొండలోని ఎంపీడీవో ఆవరణలో ఆధునీకరించిన భవిత కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాల్లో రహదారి సౌకర్యంతోపాటు చెరువులను పటిష్టం చేశామన్నారు. రైతు సంక్షేమంలో భాగంగా రుణమాఫీ, రైతు భరోసా, పంటకు మద్దతు ధర కల్పించామని చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీలను అమలు చేశామన్నారు. 

200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్  ఆరోగ్యశ్రీ కింద పరిమితి రూ.10 లక్షల వరకు పెంచామని తెలిపారు. భవిత కేంద్రాన్ని మోడల్ కేంద్రంగా తీర్చిదిద్దాలన్నారు. భవిత కేంద్రానికి ఏవైనా సహాయ సహకారాలు అవసరం ఉంటే ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అందజేస్తామన్నారు. ఈ భవిత కేంద్రానికి ఫౌండేషన్ ద్వారా రూ.10 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు.

 అనంతరం భవిత కేంద్రంలోని పిల్లలకు మంత్రి చాక్లెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్, అడిషనల్​కలెక్టర్ జె.శ్రీనివాస్, డీఈవో భిక్షపతి, పంచాయతీ రాజ్ ఈఈ గిరిధర్, డీఈ రమేశ్, ఎంఈవో కత్తుల అరుంధతి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. 

భూగర్భ జలాలు పెంచేందుకు చర్యలు చేపట్టాలి..

నార్కట్​పల్లి : భూగర్భ జలాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్ కింద భూసేకరణను త్వరగా పూర్తి చేస్తే పరిహారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ విషయంలో రైతులు సహకరించాలని కోరారు. 

యువత డ్రగ్స్​కు దూరంగా ఉండాలి

భవిష్యత్ బాగుండాలంటే యువత డ్రగ్స్​కు దూరంగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక వారోత్సవంలో భాగంగా గురువారం నల్గొండలోని పోలీస్ యంత్రాంగం, సంక్షేమశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని  జెండా ఊపి ప్రారంభించారు. ఎన్జీ కళాశాల నుంచి క్లాక్ టవర్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా తర్వాత డ్రగ్స్ వాడకం పెరిగిందని, స్టూడెంట్స్ డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో డ్రగ్స్ అన్నదే ఉండరాదని, విద్యార్థుల కోసం స్కిల్ యూనివర్సిటీ కట్టిస్తున్నామని తెలిపారు. డ్రగ్స్ వాడే వారిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.