
ఆషాడ బోనాల జాతర రివ్యూ మీటింగ్ లో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తం 28 టెంపుల్స్ లో ఆషాఢ బోనాల జాతర ఘనంగా జరపాలని, ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు రావొద్దని అన్నారు. బడ్జెట్ లోటు కూడా లేదు, ప్రభుత్వం నుండి ఇప్పటికే రూ 20 కోట్లు ఇచ్చామని, బోనాల జాతర ఘనంగా జరపాలని అన్నారు. ఇంకా కావాలంటే సీఎం దృష్టికి తీసుకెళ్దామని.. ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని అన్నారు. ఇక ఇబ్బందులు ఎక్కడా రావొద్దని, గత సంవత్సరం పొన్నం ప్రభాకర్ గారికే ఇబ్బంది వచ్చిందని.. ఈసారి అలాంటిది రావొద్దని అధికారులకు సూచించారు కొండా సురేఖ.
ఆషాఢ మాస బోనాలు సందర్భంగా అమ్మవారి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని అన్నారు. గతంలో ఏం ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేయాలనేదానిపై ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి ముందుకు వెళ్ళాలని అన్నారు.జూన్ 26తో తొలి బోనం గోల్కొండ లో ప్రారంభం అవుతుందని.. బల్కంపేట, ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజ బోనాలు ఉంటాయని అన్నారు. రంగం, తొట్టెల ఊరేగింపు కూడా ఉంటుందని అన్నారు కొండా సురేఖ.
దేవాలయాలకు ఇచ్చే చెక్స్ రెవెన్యూ, ఎండోమెంట్ కోఆర్డినేట్ చేసుకొని పండగలకు ముందే పూర్తి చేయాలని అన్నారు. అధికారులు ఉద్యోగం లాగ కాకుండా సేవ చేస్తున్నామనే దృక్పథంతో చేయాలని అన్నారు కొండా సురేఖ. సాంస్కృతిక కార్యక్రమాలు దైవ చింతనతో జరగాలని.. పోలీసులు లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఇబ్బందులు లేకుండా అన్ని రకాల డిపార్ట్మెంట్ లతో సమన్వయం చేసుకోవాలని అన్నారు కొండా సురేఖ.
ఈ మీటింగ్ లో పాల్గొన్న మరో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. 2024 యాక్షన్ ప్లాన్ ని సరిచేసుకొని 2025 లో ప్లాన్ రెడీ చేసుకోవాలని అన్నారు.గత సంవత్సరం జరిగిన పొరపాట్లు ఈసారి జరగకుండా చూసుకోవాలని అన్నారు.ఈసారి బోనాలకు ప్రభుత్వం 20 కోట్లు రిలీజ్ చేసిందని.. నూతన దేవాలయాలు ఆడ్ అయ్యాయి కాబట్టి ఇంకో 10శాతం ఫండ్స్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.
డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. గత ఏడాది చాలా కంప్లయింట్స్ వచ్చాయని, వాటిని దృష్టిలో ఉంచుకుని భద్రత చర్యలు చేపడుతున్నామని అన్నారు. అన్ని విభాగాలతో సమన్వయం అయి ప్రశాంతంగా బోనాల ఉత్సవాలు అయ్యేలా చూస్తామని అన్నారు. అన్ని శాఖల అధికారులతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు టచ్ లో ఉండి కో ఆర్డినేషన్ చేసుకుంటామని అన్నారు డీజీపీ జితేందర్. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకొంటామని అన్నారు.