తండ్రి కోసం కొడుకు..సిరిసిల్లను మించి కామారెడ్డిపై కేటీఆర్ ఫోకస్​

తండ్రి కోసం కొడుకు..సిరిసిల్లను మించి కామారెడ్డిపై కేటీఆర్  ఫోకస్​
  •     కేసీఆర్ తరఫున జోరుగా ప్రచారం
  •     మండలాల వారీగా రివ్యూలు, వరుస భేటీలు
  •     బీజేపీ, కాంగ్రెస్​ నుంచి చేరికలకు ప్లాన్​ 
  •     పోలింగ్​రోజు వరకు అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకుమంత్రి దిశానిర్దేశం

కామారెడ్డి, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి బరిలో దిగిన సీఎం కేసీఆర్​ ను ఎలాగైనా గెలిపించాలనే లక్ష్యంతో ఆయన కొడుకు, మంత్రి కేటీఆర్​ చెమటోడుస్తున్నారు. ఈసారి కాంగ్రెస్  నుంచి గట్టి పోటీ ఉండడం, ఇక్కడ సీఎం ఓడిపోతే  బీఆర్ఎస్​ పరువు పోతుందనే భయంతో తన సొంత నియోజకవర్గం సిరిసిల్ల కన్నా కామారెడ్డిపైనే కేటీఆర్  ఎక్కువ​ఫోకస్​ పెడ్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్​, ఎమ్మెల్సీ శేరి సుభాష్​ రెడ్డి లాంటి కీలక నేతలు ఉన్నప్పటికీ కామారెడ్డి బీఆర్ఎస్​ పార్టీ వ్యవహారాలన్నింటినీ కేటీఆర్​ తన చేతుల్లోకి తీసుకుని నడిపిస్తున్నారు.

ఇప్పటికే ప్రతి 100  మంది ఓటర్లకు ఒక ఇన్​చార్జిని నియమించిన ఆయన.. ప్రచార, బూత్, గ్రామ, మండల కమిటీలు సమన్వయంతో పనిచేసేలా నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అసంతృప్తులను పిలిపించుకొని మాట్లాడుతున్నారు. నియోజకవర్గంలోని ప్రముఖులతో వరుసగా భేటీ అవుతున్నారు. కామారెడ్డి మాస్టర్​ప్లాన్  బాధిత రైతు కమిటీ ప్రతినిధులతోనూ ఇటీవల చర్చలు జరిపి మాస్టర్ ప్లాన్​ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. మండలాల వారీగా రివ్యూలు, ఆకస్మిక పర్యటనలు చేస్తున్నారు.

అంతా కేటీఆర్​మయం

తాను ఈసారి గజ్వేల్​తో పాటు కామారెడ్డిలోనూ  పోటీచేస్తానని ఆగస్టు 21న సీఎం కేసీఆర్​ ప్రకటించారు. అప్పటి నుంచి  కామారెడ్డి వ్యవహరాలన్నింటినీ కేటీఆరే పర్యవేక్షిస్తున్నారు. అన్ని నియోజకవర్గాలకు పార్టీ ఇన్​చార్జిలను ప్రకటించగా  కామారెడ్డి బాధ్యతల్ని మంత్రి కేటీఆర్​ తీసుకున్నారు. నియోజకవర్గంలో తరుచూ పర్యటిస్తూ స్థానిక నేతల్ని సమన్వయం చేసుకుంటూ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు.

అక్టోబర్​ 7న  నియోజకవర్గ కేంద్రంలో  పార్టీ శ్రేణులతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. యుద్ధ ప్రాతిపదికన వంద మంది ఓటర్లకు ఒక ఇన్​చార్జి, బూత్, గ్రామ కోఆర్డినేటర్లు,  నియోజకవర్గ స్థాయిలో సమన్వయ కమిటీ నియమాకాన్ని చేపట్టారు. అసంతృప్తులతో మీటింగ్​పెట్టి బుజ్జగించడంతో పాటు స్థానికంగా బీజేపీ, కాంగ్రెస్​ నుంచి చేరికలను స్పీడప్​  చేశారు. అక్టోబర్​ 18న మండలాలు, టౌన్​కు చెందిన ముఖ్య నేతలను  హైదరాబాద్​ పిలిపించుకొని రివ్యూ చేశారు.  

గత  ఎన్నికల్లో  బూత్​ల వారీగా వచ్చిన ఓట్ల వివరాలు తెప్పించుకొని ఇన్​చార్జిలకు కొత్త టార్గెట్లు ఇచ్చారు. ఎక్కువ ఓట్లు సాధించడంలో సక్సెస్​ అయ్యే నేతలకు భవిష్యత్తులో పదవులు, ఇతరత్రా లబ్ధి చేకూరుస్తామని హామీ ఇచ్చారు. తాజాగా మంగళ, బుధవారాల్లో  కామారెడ్డి నియోజకవర్గంలో పర్యటించి, మండలాల వారీగా  సభలు ఏర్పాటు చేశారు. మాచారెడ్డి, కామారెడ్డి, భిక్కనూ సభల్లో పాల్గొన్న కేటీఆర్..​శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 

వివిధ వర్గాల్లో వ్యతిరేకత

అధికార పార్టీపై వివిధ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా  కామారెడ్డి మాస్టర్​ప్లాన్​కు వ్యతిరేకంగా తొమ్మిది గ్రామాల రైతులు రోజుల తరబడి ఉద్యమించారు. ఈ పోరాటంతో కేసీఆర్  ప్రభుత్వం దిగొచ్చింది.  మాస్టర్​ప్లాన్​ రద్దు చేస్తున్నట్లు మున్సిపాల్టీలో తీర్మానం కూడా చేయించింది. ఆందోళనకారులకు ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే కావడంతో మరోసారి  రైతు ఐక్య కార్యచరణ కమిటీ ప్రతినిధులు రంగంలోకి దిగారు. కొత్త మాస్టర్​ ప్లాన్​ రద్దుపై  ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని, లేదంటే  తమ తరపున వంద మందితో నామినేషన్లు వేయిస్తామని హెచ్చరించారు.

దీంతో కేటీఆర్​ ఈ కమిటీ ప్రతినిధులను హైదరాబాద్​కు పిలిపించుకొని మాట్లాడారు. కొత్త మాస్టర్​ ప్లాన్  రద్దుచేస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఇలాంటి హామీలను రైతులు ఎంతవరకు నమ్ముతారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరోవైపు గజ్వేల్​కు ప్రాతినిధ్యం వహిస్తున్న  సీఎం కేసీఆర్..​ అక్కడ కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండరనే అపవాదు ఉంది. దీనినే ప్రతిపక్ష లీడర్లు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కేసీఆర్​ ఒకవేళ  రెండు చోట్ల గెలిచి  కామారెడ్డి సీటును వదులుకుంటే ఉప ఎన్నికల తలనొప్పి తప్పదని చెప్తున్నారు. గజ్వేల్​లో కేసీఆర్​ అనుచరుల భూదందాలు కామారెడ్డిలో కూడా మొదలవుతాయని ప్రచారం చేస్తున్నారు.  ఇలాంటి విమర్శలను మంత్రి కేటీఆర్​ ఎలా ఎదుర్కొంటారనేది ప్రస్తుతం ఆసక్తి రేపుతోంది.