ట్రిపుల్ ఐటీలో మినీ టీహబ్, ఇన్నోవేషన్ ల్యాబ్ ఏర్పాటు చేస్తం

ట్రిపుల్ ఐటీలో మినీ టీహబ్, ఇన్నోవేషన్ ల్యాబ్ ఏర్పాటు చేస్తం

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు మంత్రి కేటీఆర్ పలు హామీలు ఇచ్చారు. ఆర్జీయూకేటీలో పర్యటించిన ఆయన విద్యార్థులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడంతోపాటు కలిసి భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నవంబర్లో మళ్లీ కాలేజీని సందర్శిస్తానని.. అప్పుడు విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేస్తామన్నారు. 3 కోట్లతో మినీ స్టేడియం, వెయ్యి కంప్యూటర్లతో డిజిటల్ ల్యాబ్, 50 అదనపు మోడర్న్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా మినీ టీహబ్, ఇన్నోవేషన్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ఆడిటోరియంలో విద్యార్థులు కింద కూర్చోవడంపై కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. మళ్లీ వచ్చేనాటికి విద్యార్థులు పైనా కూర్చోనేలా ఏర్పాట్లు చేయాలని వీసీకి సూచించారు. అదేవిధంగా విద్యార్థులతో కలిసి కేటీఆర్ కొద్దిసేపు కింద కూర్చున్నారు. అన్నీ ఇస్తాం కానీ మెయింటెనెన్స్ బాధ్యత మాత్రం విద్యార్థులదేనని చెప్పారు. ట్రిపుల్ ఐటీలో కొన్ని సమస్యలను పరిష్కరించామని.. మరికొన్ని పరిష్కరించాల్సివుందని తెలిపారు. మెస్లో బాత్రూం సహా ట్యాప్ సరిగ్గా లేదన్నారు. కొత్త మెస్సే ఇలా ఉంటే.. పాత మెస్ ఎలా ఉంటుందోనని వ్యాఖ్యానించారు.

కొంత సమయం ఇస్తే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని కేటీఆర్ చెప్పారు. విద్యార్థులు ఐక్యంగా శాంతియుతంగా పోరాడడం తనకు నచ్చిందని కేటీఆర్ తెలిపారు. ప్రజాస్వామికంగా నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందన్నారు. ఇవాళ తాను వచ్చానని మంచి భోజనం పెట్టారని..నవంబర్ లో మళ్లీ యూనివర్సిటీని సందర్శిస్తామని చెప్పారు. యూనివర్సిటీ పరిశుభ్రంగా ఉండేందుకు విద్యార్థులు కూడా సహకరించాలని మంత్రి సూచించారు.