భగీరథుడు శివుడు.. అపర భగీరథుడు కేసీఆర్

భగీరథుడు శివుడు.. అపర భగీరథుడు కేసీఆర్

త్వరలో రాష్ట్రంలో ఐదు విప్లవాలు తీసుకురాబోతున్నాం

రాష్ట్రంలోని చెరువులు, కుంటలు నింపాలన్నదే కేసీఆర్ లక్ష్యం

ప్రభుత్వం చేసిన పనులను ఐఏఎస్ అధికారులకు పాఠాలుగా బోధిస్తున్నరు

గోదావరి జలాలకు జలహారతి ఇచ్చిన మంత్రి కేటీఆర్

ఆనాటి భగీరథుడు నీటిని శివుని నెత్తి నుంచి భూమి మీదకు తెస్తే.. ఈనాటి అపర భగీరథుడు గోదావరి నీటిని కింది నుంచి పైకి తీసుకెళ్తున్నారని ఆయన అన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. ముస్తాబాద్ మండలం బదనకల్ చెరువుకు చేరిన కాళేశ్వరం నీటికి ఆయన జలహారతి ఇచ్చారు. గోదావరి జలాలు మెట్టప్రాంతమైన బదనకల్ రావడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఎర్రటి ఎండల్లో కూడా చెరువులు మత్తడి దుంకుతున్నాయి. యాభై ఏళ్లలో ఎన్నడు చూడని అద్భుత దృశ్యం చూస్తున్నాం. అన్నం తెలియదని వెక్కిరిచ్చిన వాళ్ల చెంపపై కొట్టేలా.. దేశానికే అన్నం పెట్టేలా తెలంగాణ రైతులు ఎదుగుతున్నారు. రాష్ట్రంలోని చెరువులు, కుంటలు నింపాలన్నదే కేసీఆర్ లక్ష్యం. తంగళ్లపల్లి వాగు వానాకాలంలో కూడా ఎండిపోయేది. అక్కడ ఇప్పుడు 365 రోజులు నీళ్లు ఉంటాయి. మిడ్ మానేరు నిండటంతో సిరిసిల్ల జిల్లాలో 6 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి. దేశంలో ఇదో రికార్డు. ఈ విషయాన్ని ముస్సోరీలోని సివిల్ సర్వీస్ ఐఏఎస్ అధికారులకు పాఠాలుగా బోధిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 666 చెరువులు కూడా ఇదే రీతిగా నింపుతాం. కరెంటు మీద ఆధారపడకుండా రెండు పంటలు పండించి చూపిస్తాం.

తెలంగాణ వచ్చాక ఇంత త్వరగా నీళ్లొస్తాయని ఎవరూ ఆనుకోలేదు. సముద్రమట్టానికి 82 మీటర్ల ఎత్తులో ఉన్న మేడిగడ్డ నుంచి 618 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మకు గోదావరి జలాలను సీఎం తీసుకువచ్చారు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులతో జలవిప్లవం రాబోతోంది. దాదాపు 1.25 కోట్ల ఎకరాల భూములకు సాగునీరిచ్చి రెండో హరిత విప్లవం తెస్తున్నాం. బంగారం పండే సారవంతమైన నేలలు ఇక్కడ ఉన్నాయి. నీళ్లు కూడా వస్తే రైతుల బతుకులు బాగవుతాయి. చెరువు బాగుంటే అన్ని కులవృత్తుల వారికి ఉపాధి దొరుకుతుంది. తెలంగాణలో 46 వేల చెరువులు ఇదే తీరులో నింపితే ఇక సమస్యే ఉండదు. చేపలు, రొయ్యల పెంపకం రూపంలో నీలి విప్లవం మన రాష్ట్రంలో రాబోతోంది. ఇంటింటికి గేదెలు, ఆవులిచ్చి శ్వేత విప్లవం తెస్తాం. యాదవ సోదరులకు గొర్రెలిచ్చి గతంలో ఉన్న కోటి గొర్రెలను రెట్టింపు చేశాం. మాంసోత్పత్తిలో, పౌల్ట్రీ ఉత్పత్తిలో తెలంగాణ నెంబరు వన్ అని కేంద్రమే చెబుతోంది. మాంసోత్పత్పి ద్వారా పింక్ విప్లవం (టీఆర్ఎస్ కాదు) తెస్తున్నాం. ఈ విధంగా ఐదు రకాల విప్లవాలు తెలంగాణలో తెచ్చి గ్రామీణ వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దుతాం.

కరోనా మహమ్మారి వల్ల అందరికీ మూతికి బట్టకట్టుకునే కాలమొచ్చింది. దాన్ని కూడా ఎదుర్కొందాం. బదనకల్ గ్రామానికి కావాల్సిన మౌళిక వసతులకు నిధులన్నీ కేటాయిస్తాం.  రైతుబంధు విషయంలో కొంత మంది దుష్ప్రచారం చేస్తున్నారు. ఏ ఒక్క పథకాన్ని ఆపే ఆలోచన ప్రభుత్వానికి లేదు. రైతుల కోసం ఎన్నో పనులు చేసిన కేసీఆర్‌ను మించిన ముఖ్యమంత్రి ఎవరూ లేరు. రైతు వేదికల ద్వారా అన్నదాతలను సంఘటితం చేసి బంగారు పంటలు పండేలా సమాలోచనలు చేస్తాం. వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకే నియంత్రిత పంటల విధానం అమలులోకి తెచ్చాం. రైతులకు మద్ధతు ధరకు మించిన డబ్బులు రావాలన్నదే సీఎం ఆలోచన. సర్కారు చేస్తున్న ఈ ఆలోచనకు వక్రభాష్యం చెప్తున్నారు. తాను చెప్పిందే వేయాలని సీఎం కేసీఆర్ చెప్పడం లేదు… డిమాండ్ ఉన్న పంటలు వేసుకోవాలని చెబుతున్నారు.

గతంలో రైతుబంధు వచ్చిన వారందరికీ మళ్లీ చెక్కులు ఇస్తాం. ఇంకా అవసరమైతే మరికొంత మందికి కూడా ఇస్తాం. నర్మాల చెరువును దసరాలోపే నింపి యాసంగికి నీళ్లిచ్చే బాధ్యత నాదే. మిడ్ మానేరు నుంచి 1000 కోట్లతో ఎత్తిపోతల ద్వారా.. మల్లన్నసాగర్ నుంచి కాలువ ద్వారా నర్మాల నింపాలన్న ద్విముఖ వ్యూహంతో పనిచేస్తున్నాం. జూన్ 13న కాంగ్రెస్ జలదీక్ష చేస్తారట. కుందేళ్లను చంపి తిన్న నక్కలన్నీ కలిసి సంతాప సభ పెట్టినట్లు ఉంది కాంగ్రెస్ దీక్ష. నర్మాల చెరువు ఎందుకు నిండలేదని కాంగ్రెసోళ్లు జలదీక్ష చేస్తారట. మరి 60 ఏళ్లలో మీరెందుకు ఈ చెరువు నింపలేదో చెప్పాలి. మన చెరువులు నిండి.. పొలాలు పండుతుంటే.. కాంగ్రెసోళ్ల కడుపులు మండుతున్నయి. రైతులను రాబంధుల లెక్క పీక్కు తిన్నవాళ్లు.. ఇవాళ రైతుబంధు గురించి మాట్లాడుతున్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని దీవించండి. ప్రతిపక్షాల మాటలు నమ్మకండి. ప్రతిపక్షాల తిట్లను దీవెనలు తీసుకుందాం’ అని కేటీఆర్ అన్నారు.

For More News..

ఏపీలో టైలర్లకు రూ. 10 వేలు విడుదల

వైరల్ ఆడియో: గాంధీలో అన్నీ ఇస్తున్నామన్న కేసీఆర్.. ఇప్పుడేమంటారో?

విజయవాడలో మళ్లీ లాక్డౌన్

సెకెండ్ హ్యాండ్‌ కార్లకు ఫుల్​ గిరాకీ