మతం పేరుతో చిచ్చు పెడితే ఉక్కు పాదంతో తొక్కుతామన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో రూ. 495 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ,హోంమంత్రి మహమూద్ అలీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్..మతం,కులంతో చిల్లర రాజకీయాలు చెయ్యబోమని.. న్యూ సిటీతో పోటీ పడుతూ ఓల్డ్ సిటీని అభివృద్ధి చేసి తీరుతామని..ఇది తమ కమిట్మెంట్ అని అన్నారు. మొజంజాహి మార్కెట్ ను అద్భుతంగా రేనోవేట్ చేశామన్నారు. సర్దార్ మహల్ ను టూరిస్ట్ ప్లేస్ గా తయారు చేస్తామన్నారు.
చాలా రోజుల నుంచి ఉన్న ట్రాఫిక్ సమస్య కు బహదూర్ పుర ఫ్లై ఓవర్ తో చెక్ పెట్టామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఫ్లై ఓవర్లు నిర్మిస్తామన్నారు. ఓల్డ్ సిటీకి సంబందించిన సివేరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను తీసుకొస్తామన్నారు. ఎలాంటి ఎన్నికలు లేకపోయినా ఇంత పెద్ద ఎత్తున పనులు చేస్తున్నామంటే ప్రభుత్వం ఎలా పని చేస్తుందో ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు. నోటరీ సమస్యపై ముఖ్యమంత్రితో మాట్లాడి రిజిస్ట్రేషన్ కు వెసులుబాటు చేస్తామన్నారు. ఉస్మానియా ఆసుపత్రి డెవ్ లప్ మెంట్ ను ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కొవిడ్ తో డబుల్ బెడ్ రూం ఇళ్లు కొంత ఆలస్యం అయిందని....మరో రెండు, మూడు నెలల్లో అవి పూర్తి చేస్తామన్నారు.